Akshaya Tritiya 2021: బంగారం ఎప్పుడు కొనాలి... పూజా వేళలు ఏంటి..?
అక్షయ తృతీయ.. ఈ రోజు శుభదినంగా హిందువులు విశ్వసిస్తారు. అక్షయ తృతీయానే అఖా తీజ్, పరశురామ జయంతి లేదా అక్తి అని పిలుస్తారు. అక్షయ తృతీయ ఎందుకు జరుపుకుంటారు.. దీని చరిత్ర, పూజా వేళలు గురించి తెలుసుకుందాం.
అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి
అక్షయ తృతీయాను హిందువులు జైన మతస్తులు వార్షిక వసంతకాల ఉత్సవంగా జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజున వ్రతం చేస్తే శుభం కలుగుతుందనే నమ్మకం విశ్వాసం ఉన్నాయి. ఈ రోజు చేసే పుణ్యకార్యాల ఫలం అనేది ఎప్పటికీ తరిగిపోకుండా ఉండేందుకు అక్షయ తృతీయ వ్రతం చేస్తారు. అక్షయ అంటే తరిగిపోనటువంటిది అని అర్థం. అక్షయ తృతీయ రోజున స్వర్గస్తులైన పూర్వీకులను, పెద్దలను తలుచుకుంటారు. ఈ రోజు దానాలు చేస్తే మహావిష్ణువు తృప్తి చెంది అనుగ్రహిస్తాడని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అక్షయ తృతీయను భారత్ నేపాల్లో బాగా జరుపుకుంటారు. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో వస్తుంది. ఇక గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఏటా ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుంది. అక్షయ తృతీయ రోజు ప్రారంభం నుంచి రోజు ముగిసే వరకు అంతా శుభమే జరుగుతుందనేది విశ్వాసం.
పూజా వేళలు.. బంగారం కొనుగోళ్లు
ఇక ఈ ఏడాది అక్షయ తృతీయ మే 14వ తేదీన వచ్చింది. ఇక అక్షయ తృతీయ రోజున పూజా వేళలు ఉదయం 5 గంటల 38 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే మే 15వ తేదీన ఉదయం 7 గంటల 59 నిమిషాలకు ముగుస్తాయి. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఇంటిల్లిపాది శుభం కలుగుతుందనే గట్టి నమ్మకం ఉంది. అది కూడా సుముహూర్తం దాటక ముందే కొనుగోలు చేయాలని చెబుతారు. అక్షయ తృతీయ రోజున బంగారం ఉదయం 5 గంటల 38 నిమిషాలనుంచి మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల మధ్య బంగారం కొనుగోలు చేయాలట. ఈ ముహూర్తం దాటకుండా చూసుకోవాలని పెద్దలు చెబుతారు. అయితే ప్రస్తుతం కరోనా విజృంభిస్తుండటంతో ఈ సారి బంగారు దుకాణాలు కూడా వెలవెలబోయాయి.
పరశురామ జయంతి కూడా
హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయ త్రేత యుగం ప్రారంభంను సూచిస్తుంది. ఈ రోజునే పరశురామ జయంతి కూడా జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆరవ అవతారం పరశురాముడు. అక్షయ తృతీయ రోజునే జన్మించారని పురాణాలు చెబుతాయి. విశ్వ సంరక్షకుడిగా పరశురాముడిని కొలుస్తారు. ఇక అక్షయ తృతీయ రోజునే మరో కథ కూడా జరిగిందని పురాణాలు చెబుతాయి. తన పూర్వీకులకు మోక్షం కల్పించేందుకు భగీరథ రాజు ఆదేశానుసారం గంగా నది భూమిపైకి వచ్చిందని పురాణాలు చెబుతాయి. వేదవ్యాస మహర్షి గణేశుడికి మహాభారతం కథ ఈరోజునే వినిపించినట్లు కొందరు భక్తులు చెబుతారు.
Recommended Video
ద్రౌపదికి అక్షయ పాత్ర
కరువులో ఉన్న సమయంలో పాండవుల అభ్యర్థన మేరకు శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను ఈ రోజే ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ పాత్రలో ఆహారం ఎప్పటికీ ఉంటుంది. ఇది ఖాళీగా కనిపించదు. ఎందుకంటే అక్షయ పాత్ర అనేది ఒక మాయా గిన్నె. మరొకరు ఇంకో కథను గుర్తు చేస్తున్నారు. శ్రీకృష్ణుడిని తన చిన్న నాటి స్నేహితుడైన సడమ కలిసి అనంతమైన సంపదను పొందటంతోనే అక్షయ తృతీయను జరుపుకుంటున్నామనే ప్రచారం ఉంది.