ఏప్రిల్ 1 ముహూర్తం: బీహార్లో మద్యనిషేధం
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. మొదట బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చెయ్యాలని అనుకున్నారు.
అందుకు 2016 ఏప్రిల్ 1వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. బీహార్ లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉంటుందని నితీశ్ కుమార్ గురువారం చెప్పారు. ఈ విషయంపై అధికారులతో చర్చించారు.
మద్య నిషేధం అమలు చెయ్యడానికి అవసరమైన అన్ని చర్యలు ఇప్పటి నుంచే తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత శాసన సభ ఎన్నికలను టార్గెట్ చేసుకున్న నితీశ్ కుమార్ జులై నెలలో మాట్లాడుతూ - మరో సారి తనకు అవకాశం ఇస్తే బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తానని హామి ఇచ్చారు.
చెప్పిన మాట ప్రకారం త్వరలో మద్య నిషేధం అమలు చేస్తున్నామని నితీశ్ కుమార్ ప్రకటించారు. అయితే ఆయన నిర్ణయించిన ముహూర్తం ఏప్రిల్ 1. ఆ రోజు ఫూల్స్ డే. ఆ రోజు కచ్చితంగా మద్య నిషేధం అమలు చేస్తారా, లేదా ఇంకా ముందుకు వెలుతారా అనే విషయం వేచి చూడాలి.