అలెర్ట్: మళ్ళీ భారీగా కరోనాకేసులు: 17,073 కొత్తకేసులు; 94వేలను దాటిన యాక్టివ్ కేసులు
భారతదేశంలో కరోనా కేసుల మధ్య ఊగిసలాట కొనసాగుతోంది. నిన్న కాస్త తగ్గినట్టు గా కనిపించిన కరోనాకేసులు మళ్లీ ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 17,073 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు 5వేల కేసుల వరకు పెరిగినట్టు కనిపిస్తోంది. తాజాగా నమోదైన కరోనా కేసులతో కలిపి భారతదేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 4,34,07,046 కు చేరాయి. కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరగటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది.
దేశంలో 21 కొత్త కరోనా మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 5,25,020కి చేరుకుంది. దేశంలో ప్రస్తుతం మరణాల రేటు 1.21శాతానికి చేరుకుంది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో 15,208 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. ఇక మొత్తం కేసులలో కరోనా యాక్టివ్ కేసులు 0.21 శాతంగా ఉన్నాయి.
తాజాగా యాక్టివ్ కేసులలో గత 24 గంటల్లో 1,884 కేసులు పెరిగాయి. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య దేశంలో 94,420 గా కొనసాగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం భారతదేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 5.62 శాతంగా నమోదైంది. వారపు పాజిటివిటీ రేటు 3.39 శాతంగా నమోదయింది. ఇక మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలు అధికంగా కరోనా కొత్త కేసులను నమోదు చేస్తున్నాయి.
గత 24 గంటల్లో నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 3,03,604గా నమోదైంది. గత 24 గంటల్లో 2,49,646 వ్యాక్సిన్ డోస్లు ఇవ్వబడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం టీకా 197,11,91,329కి చేరుకుంది. ఇక పెరుగుతున్న కేసులతో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి. మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నాయి. ఇక అనేక రాష్ట్రాలలో పెరుగుతున్న కేసులతో కోవిడ్ రూల్స్ పాటించాలని చెప్తున్నాయి.