భారతీయులంతా హిందువులే, ముస్లీంలు...: ఆరెస్సెస్
లక్నో: భారత దేశంలో ఉన్న పౌరులందరినీ ఆరెస్సెస్ హిందువులుగానే చూస్తుందని, కులం, మతం ఆధారంగా వివక్ష చూపదని ఆ సంస్థ ప్రచార విభాగం బాధ్యులు మన్మోహన్ వైద్య గురువారం అన్నారు. లక్నోలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరెస్సెస్తో ప్రజల అనుబంధం రోజురోజుకు పెరుగుతోందన్నారు.
2012లో ప్రతి నెల తాము సగటున వెయ్యి దరకాస్తులను స్వీకరిస్తే, ప్రస్తుతం ఆ సంఖ్య ఏడువేలకు పెరిగిందన్నారు. మైనార్టీల నుండి ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయని విలేకరులు అడిగారు. దానిపై ఆయన స్పందిస్తూ.. తమ దృష్టిలో మైనార్టీలు ఎవరు లేరన్నారు. కులం, మతం ఆధారంగా ఆరెస్సెస్ వివక్ష చూపదని చెప్పారు. తమకు అందరు సమానులే అన్నారు.
భారత దేశంలో నివసిస్తున్న వారంతా హిందువులేనని తమ అభిప్రాయమని ఆయన చెప్పారు. ఆరెస్సెస్ శిక్షణా శిబిరాలకు ముస్లింలు కూడా వస్తున్నారని తెలిపారు. సంస్థలో కొత్తగా చేరే వారి కోసం గత ఏడాది ఏడు రోజు పాటు నిర్వహించిన శిబిరానికి 80వేల మంది హాజరు కాగా, ఈసారి అది 1.2 లక్షలకు పెరిగిందని చెప్పారు.
ఆరెస్సెస్ సమావేశాలకు అమిత్ షా
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ఉత్తర ప్రదేశ్లో నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఆరెస్సెస్ సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలతో పాటు అయోధ్య రామ మందిర నిర్మాణంపై చర్చ జరిగే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినవస్తున్నాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా.. ఈ సమావేశాలకు మాత్రం స్వయంసేవక్గానే హాజరవుతున్నారు. బీజేపీ తీసుకునే పలు నిర్ణయాలపై ఆరెస్సెస్ ప్రభావముంటోంది.
ఈ నేపథ్యంలో కీలకాంశమైన రామ మందిర నిర్మాణం పైనా ఆయనతో ఆరెస్సెస్ నేతలు చర్చించే అవకాశాలున్నాయంటున్నారు. ఆరెస్సెస్ సమావేశంలో లవ్ జిహాద్ అజెండాలో లేదని తెలుస్తోంది. అయితే, ఉత్తర ప్రదేశ్ ముస్లీం వర్గాలను బీజేపీకి చేరువ చేసే అంశంపై చర్చించనున్నారని తెలుస్తోంది.