ఏ భారత జవానూ మిస్సవలేదు: సరిహద్దు ఘర్షణపై ఇండియన్ ఆర్మీ వెల్లడి
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో గల్వాన్ లోయ వద్ద ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణలో ఏ ఒక్క భారత జవాను కూడా గల్లంతు కాలేదని, అందరి ఆచూకీ లభ్యమైందని గురువారం సీనియర్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఘటన అనంతరం గాయపడిన, కనిపించకుండా పోయిన సైనికుల కోసం భారత సైన్యం గాలింపు చేపట్టింది.
భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు: డ్రాగన్ బుద్ధి మారదంటూ అమెరికా ఆగ్రహం
సోమవారం జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. వీరిలో కల్నల్ స్థాయి అధికారి(కల్నల్ సంతోష్ బాబు) కూడా ఉన్నారు. కాగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.
సుమారు ఐదు దశాబ్దాల తర్వాత ఇరుదేశాల మధ్య ప్రాణాలు తీసుకునేంత ఘర్షణ చోటు చేసుకోవడం గమనార్హం. అయితే, చైనా వైపున ఎంతమంది మరణించారనే విషయం మాత్రం ఆ దేశం ఇప్పటికీ ప్రకటించలేదు. అయితే, సుమారు 45 మంది డ్రాగన్ సైనికులు హతమవడం లేదా గాయపడటం జరిగి ఉంటుందని భారత ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటికే అమెరికా ఇంటెలీజెన్స్ వర్గాలు 35 మందికిపైగా చైనా సైనికులు ఈ ఘర్షణలో మరణించినట్లు వెల్లడించింది. కాగా, ఘర్షణ జరిగిన తర్వాత చర్చలు జరుపుతామని, శాంతినే కోరుకుంటామని చెబుతున్న జిత్తులమారి చైనా.. సరిహద్దులో భారీగా సైనికులను మోహరించడం గమనార్హం.
తాజా ఘర్షణల నేపథ్యంలో భారత్ కూడా చైనా బలగాలపై నిఘా పెట్టింది. అంతేగాక, సరిహద్దుల వెంబడి పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలను సిద్ధం చేసింది. మరోవైపు పాక్ సైనికులు, ఉగ్రవాదులకు భారత భద్రతా దళాలు ధీటుగా జవాబిస్తున్నాయి.