అక్కడ దాడులు వద్దు.. ఉక్రెయిన్, రష్యాను కోరాం.. వారంతా సేఫ్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
రష్యా యుద్దంతో ఉక్రెయిన్ అల్లాడిపోతుంది. ప్రధాన నగరాలు.. జనం భయాందోళనకు గురువుతన్నారు. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఉక్రెయిన్, రష్యా ఎంబసీ అధికారులతో భారత దౌత్య అధికారులు మాట్లాడుతున్నారని తెలిపారు. భారత ఎంబసీ ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి దాడులు చేయొద్దని ఇరుదేశాలను కోరుతున్నామని వెల్లడించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విమానాలు నడిపే పరిస్థితి అక్కడ లేదన్నారు. రోడ్డు మార్గాన సైతం వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.
రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు ప్రధాని కానీ కేంద్ర విదేశాంగ మంత్రి కానీ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. శాంతియుతంగా ఉండాలనేది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫండమెంటల్ పాలసీ అని చెప్పారు. భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుందని, భారత పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా దాడిలో 40 మంది యుక్రెయిన్ సైనికులు మృతిచెందారు. పదిమందికి పైగా సామన్య పౌరులు మృతిచెందినట్టు ప్రకటించారు. రష్యా దాడులను ఉక్రెయిన్ సైనిక దళం కూడా తిప్పికొడుతోంది. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులు బిక్కుమంటూ గడుపుతున్నారు.

దాదాపు 18వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ తెలిపారు. ఉక్రెయిన్లో గగనతలం మూసివేసిన క్రమంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఉక్రెయిన్లోని భారతీయులందరి భద్రతకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పారు.
ఇటు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించేసింది. ఉక్రెయిన్పై మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై రష్యా బాంబు దాడులకు పాల్పడుతోంది. యుద్ధం తమ ఉద్దేశం కాదని చెప్తూ వచ్చిన పుతిన్.. అకస్మాత్తుగా ఉక్రెయిన్పై దాడికి దిగారు. యుద్ధ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు పుతిన్ గట్టి హెచ్చరికలు కూడా చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బయటి దేశాలు జోక్యం చేసుకోవాలని చూస్తే.. చరిత్రలో మునుపెన్నడూ ఎదురుకాని తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. మీరు నా మాట వింటారని ఆశిస్తున్నట్లు ప్రపంచ దేశాలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఉక్రెయిన్పై యుద్ధం ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం కోసం కాదని.. ఉక్రెయిన్ను సైనిక రహితం చేయడం కోసమేనని తెలిపారు.












Click it and Unblock the Notifications