జేడీఎస్ను కలవరపెడుతున్న ఎమ్మెల్యేల జంపింగ్స్: కేరళకు తరలింపు!
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందు వచ్చాయి. అయితే, 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ కూడా రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ను కోరింది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని విన్నవించింది. గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానని ఇప్పటీకే బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి నిన్నటి వరకు మద్దతు అని తెలిపిన స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్.. ఇప్పుడు బీజేపీకి మద్దతిస్తానంటూ ముందుకు వచ్చారు. దీంతో బీజేపీకి105మంది ఎమ్మెల్యేల మద్దతి లభించినట్లయింది.

అంతేగాక, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించాయి. ఇప్పటికే మెజార్టీ ఎమ్మెల్యేలను బెంగళూరులోని షాంగ్రీలా హోటల్కు తరలించారు.
అయితే, ఇక్కడ కూడా అంత సురక్షితం కాదని భావించిన జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు.. తమ ఎమ్మెల్యేలను కేరళలోని కొచ్చికి తరలించాలని నిర్ణయించాయి. బుధవారం సాయంత్రం జేడీఎస్ తమ ఎమ్మెల్యేలందర్నీ కేరళలోని రిసార్టులు లేదా హోటళ్లకు తరలించనున్నట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే జేడీఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి అందుబాటులో లేకపోవడం గమనార్హం.
ఇది ఇలా ఉంటే, కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుండటం, ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తమ రాష్ట్ర పర్యటనకు వచ్చి సేదతీరాలని కేరళ పర్యాటక శాఖ ట్విట్టర్ ద్వారా కోరడం గమనార్హం. దీంతో పలువురు నెటిజన్లు ఈ ట్వీట్కు సరదాగా స్పందించగా, మరికొందరు విమర్శలు గుప్పించారు. దీంతో ఈ ట్వీట్ను కేరళ పర్యాటక శాఖ తొలగించింది.












Click it and Unblock the Notifications