అందరూ సమానమే: మదర్సాలపై యోగి ప్రభుత్వం మరో సంచలనం
లక్నో: యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. ఉత్తర ప్రదేశ్లోని మదర్సాలలో డ్రెస్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనిపై అందరి నుంచి సూచనలు తీసుకొని నిర్ణయిస్తున్నామని సంబంధిత మంత్రి తెలిపారు.
రాష్ట్ర మదర్సా బోర్డుకు అనుబంధంగా ఉన్న స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు డ్రస్ కోడ్ తప్పనిసరి చేయాలని భావిస్తోంది. దీంతో ఇకనుంచి మదర్సా విద్యార్థులు కుర్తా, ఫైజమాకు స్వస్తి చెప్పి, ఫ్యాంటు, షర్ట్ ధరించాల్సి ఉంటుంది.
ఇతర స్కూళ్లలోని విద్యార్థులతో సమానంగా మదర్సా విద్యార్థులకు కూడా గుర్తింపు ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. మదర్సాలలో విద్యను ఆధునీకరించేందుకు యూపీ ప్రభుత్వం ఇటీవల మదర్సాలలో ఎన్సీఈఆర్టీ బుక్స్ను ప్రవేశపెట్టింది.
అన్ని విద్యాసంస్థలతో సమానంలో మదర్సాలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పటి వరకు మదర్సాలలో విద్యార్థులు తెల్ల కుర్తా, ఫైజమా ధరిస్తున్నారని, ఎంతో కొంత ఇది నిర్దిష్ట విశ్వాసాలకు ప్రతీకగానే ఉంటోందని, అంతా సమానమనే భావన నెలకొల్పేందుకు త్వరలోనే కొత్త డ్రస్ కోడ్ను ప్రతిపాదించబోతున్నామని మైనార్టీ శాఖ మంత్రి తెలిపారు.
అలీ గడ్ ముస్లీం యూనివర్శిటీలోనూ డ్రస్కోడ్ ఉందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ డ్రస్ కోడ్ ఉండటం వల్ల అంతా ఒకటనే భావన కలుగుతుందన్నారు.