ఒక దేశం ఒక కార్డు: బస్సు ఛార్జీల నుంచి టోల్ ఛార్జీలవరకు..అన్నీ ఈ కార్డుతోనే..!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వన్ నేషన్ వన్ కార్డు గురిచి ప్రస్తావించారు. దీనర్థం ఒక దేశం..ఒక కార్డు. ఈ కార్డుపై లోక్సభ ఎన్నికలకంటే ముందు నుంచే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.ఇంతకీ వన్ నేషన్ వన్ కార్డు అంటే ఏమిటి...? ఈ కార్డు వల్ల ఉపయోగాలేమిటి..?
అన్ని రవాణా చెల్లింపులకు వన్ నేషన్ వన్ కార్డు
వన్ నేషన్ వన్ కార్డు గురించి ఈ మధ్యకాలంలో బాగా చర్చ జరుగుతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా నిర్మలా సీతారామన్ ఈ కార్డు గురించి ప్రస్తావించారు. ఒక్క కార్డు ఉంటే అన్ని రకాల రవాణా సంస్థల్లో ఛార్జీల చెల్లింపులు చేయొచ్చు. దీన్నే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు అని కూడా పిలుస్తారు. ఈ కార్డు ద్వారా మెట్రో రైలు ఛార్జీలు, రైల్వే ఛార్జీలు, బస్సు ఛార్జీలు, టోల్ గేట్ల దగ్గర ట్యాక్స్, పార్కింగ్ ఛార్జీలు, షాపింగ్ చేసిన సమయంలో డబ్బులు చెల్లించేందుకు ఉపయోగపడుతుంది.
వన్ నేషన్ వన్ కార్డుగా రూపే కార్డు
ఈ కార్డును రూపే కార్డుపై అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ కార్డు ఉంటే రవాణా రంగానికి సంబంధించిన అన్ని ఛార్జీలు చెల్లించవచ్చని కేంద్రం పేర్కొంది. మెట్రోలో కానీ, బస్సుల్లో కానీ, రైళ్లలో కానీ ప్రయాణించే సమయంలో చిల్లర సమస్యలు తలెత్తుతుంటాయి. నగదు రూపంలో ఛార్జీలు కొనాలంటే సరిపడా చిల్లర ఉండదు. అయితే ఈ కార్డు ద్వారా అలాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చని కేంద్రం చెబుతోంది. అయితే ఈ తరహా కార్డును ప్రయోగాత్మకంగా ప్రారంభించినప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అంటే ఒకే కార్డుపై ఇవన్నీ జరగాలంటే ఆయా శాఖలు సమన్వయం అవసరం. ఒక నగరంలో ఈ కార్డు పనిచేస్తుంటే మరో నగరంలో ఇది పనిచేయడం లేదు. ఇలాంటి సమస్యలు లేకుండా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్ని శాఖల మంత్రులతో పాటు బ్యాంకులను కూడా ఆదేశించారు.
వన్ నేషన్ వన్ కార్డుతో డబ్బులు కూడా డ్రా చేసుకోవచ్చు
ఇక వన్ నేషన్ వన్ కార్డుతో దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలనుంచి కూడా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పించింది కేంద్రం. ఇక వన్ నేషన్ వన్ కార్డు టెక్నాలజీ కొన్ని దేశాల్లో మాత్రమే వినియోగంలో ఉండేది. అలాంటి దేశాల సరసన భారత్ కూడా చేరనుంది. మేకిన్ ఇండియాలో భాగంగా ఈ కార్డులను సొంత టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. అంతే కాదు ఈ తరహా కార్డుతో విదేశీ టెక్నాలజీపై ఇక ఆధారపడాల్సిన పరిస్థితి లేదని ప్రభుత్వం చెబుతోంది.