రగులుతున్న క్యాంపస్- వాహనాలకు నిప్పు- హింస: పోలీసులనూ వదల్లేదు: రాత్రంతా ఆందోళన
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని ప్రతిష్ఠాత్మక అలహాబాద్ విశ్వవిద్యాలయంలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. దాడులు చేశారు. ఫర్నిచర్ను తగులబెట్టారు. వాహనాలనూ వదల్లేదు. వాటికీ నిప్పంటించారు. ఈ పరిణామాలతో యూనివర్శిటీ క్యాంపస్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే అదనపు పోలీసు బలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. పరిస్థితులను అదుపు తెచ్చాయి.
దీనికంతటికీ కారణం- క్యాంపస్ సెక్యూరిటీ గార్డులేనని చెబుతున్నారు. క్యాంపస్లోకి ప్రవేశించకుండా ఓ విద్యార్థి సంఘం మాజీ నాయకుడిని సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతో ఆరంభమైన వాగ్వివాదం గాలివానగా మారింది. ఆయనకు మద్దతుగా తోటి విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. క్యాంపస్ ఆవరణలోనికి తీసుకుని రావడానికి విద్యార్థులు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ- సెక్యూరిటీ గార్డులు అడ్డుపడ్డారు.

దీనితో ఈ రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పార్క్ చేసి ఉంచి స్కూటర్లు, బైక్లకు నిప్పు పెట్టారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అలహాబాద్ యూనివర్శిటీ క్యాంపస్కు చేరుకున్నారు. విద్యార్థులు, సెక్యూరిటీ గార్డులను చెదరగొట్టడానికి లాఠీ ఛార్జ్ చేశారు. దీనితో విద్యార్థులు మరింత రెచ్చిపోయారు. ఆగ్రహావేశాలకు గురయ్యారు. పోలీసులపైనా రాళ్లు రువ్వారు.
పరిస్థితులు అదుపు తప్పడంతో జిల్లా పోలీసులు అదనపు పోలీసు బలగాలను యూనివర్శిటీ క్యాంపస్ వద్ద మోహరింపజేశారు. ప్రయాగ్రాజ్ పోలిస్ కమిషనర్ రమిత్ శర్మ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. యూనివర్శిటీ క్యాంపస్లో శాంతియుత వాతావరణం ఏర్పడిందని, నిరసనకారులను స్టూడెంట్స్ యూనియన్ కార్యాలయం వద్ద ఇరు పక్షాల వారితో మాట్లాడామని చెప్పారు.












Click it and Unblock the Notifications