ఎస్పీ-బీఎస్పీ.. పొత్తుకు 'సై': అధికారికంగా ప్రకటించిన మాయావతి..
లక్నో: రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు ఎస్పీ-బీఎస్పీ సిద్దమవుతున్నాయి. గోరఖ్పూర్, పూల్ పూర్ లోక్సభ ఉపఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ పొత్తు పనిచేయడంతో.. 2019ఎన్నికల్లోనూ ఇదే స్ట్రాటజీని అమలుచేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటిదాకా రెండు పార్టీల మధ్య చర్చలు జరగ్గా.. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి పొత్తుపై క్లారిటీ ఇచ్చారు.
2019లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేస్తాయని మాయావతి అధికారికంగా ప్రకటించారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక అవగాహనకు వచ్చినట్టు చెప్పారు. లోక్ సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందునా.. ఆలోగా సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు.
కాగా, 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీకి 41.8 శాతం ఓట్లు, బీజేపీకి 43.3 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్ 7.5 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ఎస్పీ, బీఎస్పీ వేర్వేరుగా పోటీ చేయడం ద్వారా అది బీజేపీకి లాభించింది. దీంతో 2019ఎన్నికల్లో కలిసి పోటీ చేసి బీజేపీని దెబ్బకొట్టాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి.
సోషల్ ఇంజనీరింగ్ లో సిద్దహస్తురాలైన మాయావతి 2019లోనూ దాన్ని రిపీట్ చేసే అవకాశాలున్నాయి. ఎస్పీ-బీఎస్పీ పొత్తుతో ఉత్తరప్రదేశ్ లోని 19శాతం ముస్లింలు, 21శాతం దళితులు, 7శాతం యాదవులు, 32శాతం ఓబీసీల ఓట్లు తమ ఖాతాలోకి వస్తాయని మాయావతి అంచనా వేస్తున్నారు.
గత లోక్ సభ ఎన్నికల్లో 80సీట్లకు గాను బీజేపీ 71సీట్లు గెలుచుకుంది. ఎస్సీ రిజర్వ్ స్థానాలైన 17నియోజకవర్గాల్లోనూ బీజేపీనే గెలిచింది. కానీ తాజా పొత్తుతో ఆ స్థానాలన్ని తిరిగి తమ ఖాతాలోకే వస్తాయని మాయావతి భావిస్తున్నారు.