లాటరి స్కాం: ఐజీపీ సస్పెండ్, గవర్నర్ ఎంట్రీ, నో సీబీఐ
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వంతో పాటు దేశాన్ని కుదిపేసిన అక్రమ సింగిల్ నెంబర్ లాటరీ స్కాం కేసులో ఐజీపీ స్థాయి అధికారి (సీనియర్ ఐపీఎస్) అలోక్ కుమార్ ను సీఐడి పోలీసులు విచారణ చేస్తున్నారు. అక్రమ లాటరీ స్కాంలో ఆయన పాత్రపై ప్రశ్నిస్తున్నారు.
బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ గా పని చేస్తున్న అలోక్ కుమార్ కు రూ. కోట్లలో జరిగిన అక్రమ లాటరి దందా, ఐపీఎల్ బెట్టింగ్ లో నేరుగా ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తు శనివారం పోద్దు పోయిన తరువాత ఆదేశాలు జారీ చేసింది.
ఆదివారం అలోక్ కుమార్ ను సీఐడి అధికారులు వారి కార్యాలయానికి పిలిపించుకుని 9 గంటల పాటు విచారణ చేశారు. అదే విదంగా సోమవారం మూడు గంటలు విచారణ చేశారు. వివరాలు సేకరిస్తున్న సీఐడి అధికారులు అలోక్ కుమార్ ను ఎప్పుడు అయినా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు అంటున్నాయి.
నివేదిక ఇవ్వండి..... గవర్నర్ బాయ్
రూ. వందల కోట్ల లాటరి స్కాం కేసులో ఐపీఎస్ అధికారుల పేర్లు బహిరంగంగా వినిపిస్తున్నాయని కేసు దర్యాప్తు వివరాల నివేదిక ఇవ్వాలని కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీకి సూచించారు. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేసిన తరువాత గవర్నర్ వాజుభాయ్ వాల ప్రభుత్వం నుండి వివరణ కోరారు.
సీబీఐ దర్యాప్తు లేదు....... సిద్దరామయ్య
లాటరీ స్కాం కేసులో పోలీసు అధికారుల ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే కేసు దర్యాప్తు సీఐడి అధికారులు చేస్తున్నారని తప్పు చేసిన వారు ఎవరైనా సరే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కేసును సీబీఐకి అప్పగించమని ఆయన స్పష్టం చేశారు.