అమర్నాథ్ యాత్రను వదలని మహమ్మరి: ఈ ఏడాది రద్దు చేసిన బోర్డు, వర్చువల్ విధానంలో దర్శనం..
కరోనా వైరస్ విజృంభించడంతో ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్రను కూడా రద్దు చేశారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందన యాత్రను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం జమ్ముకశ్మీర్ గవర్నర్ గిరిశ్ చంద్ర ముర్ము అధ్యక్షతన 39వ శ్రీ అమర్ నాథ్ ఆలయ బోర్డు సమావేశం వర్చువల్ విధానంలో వేదికగా జరిగింది. వైరస్ వల్ల యాత్రను నిర్వహించలేమని అభిప్రాయం వ్యక్తమైంది.
ఈ నెల 13వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా సమావేశంలో కమిటీ చర్చించింది. అమర్ నాథ్ యాత్రను నిర్వహించాలా వద్ద అనే అంశంపై జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం నిర్ణయం తీసుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే. జమ్ము కశ్మీర్లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.. జూలై నెలలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా జరిగింది. ఆరోగ్య కార్యకర్తలు, భద్రతా సిబ్బందికి కూడా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో యాత్రను నిర్వహించలేము అని బోర్డు నిర్ణయించింది. లక్షలాది మంది భక్తుల మనోభావాలను బోర్డు గౌరవిస్తోందని.. కానీ వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో తప్పడం లేదన్నారు. అయితే ఉదయం, సాయంత్రం ప్రత్యక్ష ప్రసారం (వర్చువల్ దర్శనం) అనుమతిస్తామని చెప్పారు. సాంప్రదాయం, ఆచారాలను పూజారులు నిర్వహిస్తారని బోర్డు తెలిపింది.