కీలక సమయంలో మోదీకి జగన్ అండ - వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు - బీజేపీ మిత్రులే షాకిచ్చిన వేళ
వ్యవసాయ రంగానికి సంబంధించి మోదీ సర్కార్ తీసుకొచ్చిన మూడు సవరణ బిల్లులపై రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.. కొవిడ్ పరిస్థితుల్లోనూ ఉత్తరాదిలో లక్షలాది మంది రైతులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు.. దక్షిణాదిలోనూ పలు రాష్ట్రాలు ఈ బిల్లులపై అసంతృప్తి వ్యక్తం చేశాయి.. సంచలన రీతిలో ఎన్డీఏ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్.. హర్సిమ్రత్ కౌర్ బాదల్ చేత కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయించింది.. ఇలాంటి కీలక సమయంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ప్రధాని మోదీకి, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు అండగా నిలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు..
వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణలంటూ కేంద్రం తీసుకొచ్చిన మూడు కీలక బిల్లులపై గురువారం లోక్ సభలో చర్చ జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో రైతు సంక్షేమం గురించి ఆలోచించిన తొలి నేత ప్రధాని మోదీ ఒక్కరే అని బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తున్నదని ప్రకటించారు. అయితే, వ్యవసాయ మార్కెటింగ్లో గుత్తాధిపత్య ధోరణులను నివారించాలని, ఏపీఎంసీ మర్కెట్లలో రాష్ట్రాలకు వచ్చే నష్టాలకు కేంద్రం పరిహారం చెల్లించాలని వైసీపీ కోరుతున్నామని ఎంపీ అన్నారు. సభ వాయిదా అనంతరం, కేంద్ర మంత్రి కౌల్ రాజీనామాపై స్పందిస్తూ.. పంజాబ్ లో ప్రతిపక్షంగా ఉన్న అకాలీదళ్ అక్కడి రాజకీయ పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని కృష్ణదేవరాయ అన్నారు.

సొంతవాళ్లే వ్యతిరేకించినా..
వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా గురువారం లోక్ సభలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీకి అత్యంత విశ్వసనీయ మిత్రుడిగా, ఎన్టీఏలో చిరకాల భాగస్వామిగా కొనసాగుతోన్న శిరోమణి అకాలీదళ్ సదరు బిల్లుల్ని తీవ్రస్వరంతో వ్యతిరేకించింది. రైతు వ్యతిరేక బిల్లులకు నిరసనగా ఆ పార్టీ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. బీజేపీకి సొంత మనుషులు అనుకున్నవాళ్లే ఇంతటి తీవ్ర నిర్ణయాలు తీసుకున్నవేళ.. మిగతా పార్టీలన్నీ బిల్లుల్ని వ్యతిరేకిస్తున్నా.. వైసీపీ మాత్రం మోదీ సర్కారుకు మద్దతు పలకడం చర్చనీయాంశమైంది.
Recommended Video

వ్యవసాయ బిల్లుల్లో ఏముందంటే..
కేంద్రం రూపొందించిన వ్యవసాయ బిల్లుల్లో మొదటిది, రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు. దీనివల్ల రైతులు తమ పంటల్ని మార్కెట్ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధన తొలగిపోయి, ఎక్కడైనా అమ్ముకునే వీలు ఏర్పడుతుందని కేంద్రం చెబుతున్నది. రెండోదైన రైతుల (సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లుతో రైతుల ధరల హామీ, సేవల ఒప్పందం ప్రకారం పంటలు వేయడానికి ముందే వ్యాపారస్తులతో రైతులు చేసుకునే ఒప్పందాలకు చట్టబద్ధత వస్తుందని, ఇక మూడోదైన నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లు ద్వారా చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటి ఆహార ఉత్పత్తుల నిల్వలపై ఆంక్షలు తొలగిపోతాయని కేంద్రం పేర్కొంది. కానీ ఈ మూడు బిల్లులూ రైతు వ్యతిరేకమైనవేనని, దళారీ, కార్పొరేట్ వ్యవస్థల్ని బలోపేతం చేసేవేనని అకాలీదళ్ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి.












Click it and Unblock the Notifications