తుస్: చైనా ఆర్మీ ముందే ఝలక్ ఇచ్చిన భారత్
న్యూఢిల్లీ: చైనాకు భారత్ పెద్ద ఝలక్ ఇచ్చింది. చైనా సైన్యం ముందే వాళ్లు చూస్తుండగానే తన పని పూర్తి చేసి ఇది భారతీయుడి దెబ్బ అని రుచిచూపించారు. లడఖ్ ( తూర్పు లడఖ్) ప్రాంతంలోని డెమ్చోక్ అనే గ్రామానికి భారత ప్రభుత్వం నిర్మిస్తున్న సాగునీటి పైప్లైన్ను భారత ఆర్మీ విజయవంతంగా పూర్తిచేసింది.
గత వారం రోజులకు పైగా చైనా దళాలు అడ్డుతగులుతున్నప్పటికీ భారత సైన్యం ఏమాత్రం వెనక్కితగ్గకుండా తన పని పూర్తి చెయ్యాలని భావించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ సాగునీటి ప్రాజెక్టును నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది.
అయితే రెండు దేశాల మధ్య గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆ ప్రాంతంలో రక్షణ అవసరాలకు తప్ప మరే ఇతర నిర్మాణాలు చేపట్టకూడదని పేర్కొంటూ చైనా పీపుల్స్ ఆర్మీ ఈనెల 2వ తేదీన పనులు అడ్డుకునేందుకు ప్రయత్నించింది.
చైనా తూర్పు లడఖ్ ప్రాంతంలో సైనికులను మోహరించింది. అంతే కాకుండా ఎఫ్ఆర్పీ షెడ్ను నిర్మించేందుకు విఫలయత్నం చేశారు. అయితే భారత సైన్యం ఐటీబీపీ ( ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్) దళాలు చైనా ఆటలు సాగనివ్వలేదు.
చైనా-భారత్ భారీగా దళాలను మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రోజుల పాటు భారత్-చైనా దేశాల సైన్యం ముఖాముఖి నిలబడడంతో పరిస్థితి అదుపుతప్పినట్టు అయ్యింది.
అయినా ఏమాత్రం వెనక్కి తగ్గని భారత సైన్యం సాగునీటి పైపులైను నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేసి చైనాకు గట్టి ఝలక్ ఇచ్చింది. చైనా సైన్యం చూస్తుండగానే సాగునీటి పైప్ లైన్ పనులు చకచక పూర్తిచేసి చైనాకు పెద్ద షాక్ ఇచ్చింది.
లడఖ్ పరిసర ప్రాంతాల్లో భారత్ చేపట్టే ప్రతి పనికీ అడ్డుతగలడం చైనాకు అలవాటు అయిపోయింది. 2014లో నీలుంగ్ నల్లా కెనాల్ వద్ద చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టు చేపట్టిన సమయంలో చైనా ఇలాంటి చర్యలకు పాల్పడటంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకోన్నాయి.