Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్‌లో ఓ వైపు వాతావరణ హెచ్చరికలు దడ పుట్టిస్తుంటే – కేంద్రం బొగ్గు తవ్వకాలకు విచ్చల విడిగా అనుమతులు ఎందుకు ఇస్తోంది?

బొగ్గు

దేశంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారనుందని హెచ్చరిస్తూ తొలిసారిగా ఓ నివేదికను కొద్ది రోజుల క్రితం విడుదల చేసింది భారత్.

అదే సమయంలో కోవిడ్-19 తర్వాత దేశ ఆర్థిక ప్రగతిని పరుగులెత్తించడంలో భాగంగా బొగ్గు గనుల్ని ప్రైవేటు పరం చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 41 బొగ్గు గనుల్లో కమర్షియల్ మైనింగ్‌కు అనుమతిస్తున్నట్టు భారత ప్రధాని నరేంద్రమోదీ గత వారం ప్రకటించారు. అంతేకాదు.. బొగ్గు ఎగుమతుల్లో ప్రపంచంలో నాల్గో స్థానంలో ఉన్న భారత్ త్వరలోనే నెంబర్ వన్ కావాలని కూడా ఆకాంక్షించారు. నిజానికి పర్యావరణ కాలుష్యం విషయంలో బొగ్గుదే ప్రధాన పాత్ర.

భారత భూగర్భ శాస్త్ర మంత్రిత్వ శాఖ (మినిస్టరీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆఫ్ ఇండియా) విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఇప్పటికే దేశంలో వాతావరణ పరిస్థితులు ఘోరంగా తయారయ్యాయి. తీవ్ర తుపానులు, వరదలు, అత్యధిక ఉష్ణోగ్రతలు దేశంలో సర్వ సాధారణమైపోయాయి.

ప్రపంచ వ్యాప్తంగా మానవ కార్యకలాపాల వల్లే ఈ పరిస్థితులు దాపురించాయని ఆ నివేదిక తెలిపింది. అందులో ముఖ్యమైనది శిలాజ ఇంధనాలను అతిగా వినియోగించడం, మరీ ముఖ్యంగా బొగ్గును విచ్చల విడిగా ఉపయోగించడం.

బొగ్గును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి. అదే సమయంలో అధికంగా కర్బన ఉద్గారాలను విడుదల చేసే దేశాల్లో చైనా, అమెరికాల తర్వాత మూడో స్థానంలో ఉంది. అంతే కాదు అత్యంత దారుణమైన వాతావరణ పరిస్థితులున్న ప్రాంతంలో భారత్ ఉంది.

ప్రధాని మోదీ

నివేదికలో ఏముంది?

దేశంలో తరచు కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అతివృష్టి సర్వ సాధారణమవుతోంది. ఎప్పటికప్పుడు తీవ్రమైన తుపాను తీర ప్రాంతాలను భయపెడుతున్నాయి అని తాజా నివేదిక తెలిపింది.

వచ్చే పదేళ్ల కాలంలో దేశంలోని సరాసరి ఉష్ణోగ్రతలు సుమారు 4 డిగ్రీల వరకు పెరగవచ్చు. వేసవి వడగాడ్పులు మూడు-నాలుగు రెట్లు ఎక్కువ కావచ్చు. అంతేకాదు కర్బన ఉద్గారాలు తీవ్ర స్థాయిలో వెలువడుతున్న నేపథ్యంలోఈ శతాబ్దం చివరినాటికి పదేళ్లలో రెండు కన్నా ఎక్కువ సార్లు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నివేదిక హెచ్చరించింది.

దీని ప్రభావంతో దేశంలోని అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని నివేదిక స్పష్టం చేసింది.

"ఈ పరిణమాలు దేశ జీవ వైవిధ్యం, ఆహారం, నీరు, ఇంధన భద్రత, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి" అని నివేదిక పేర్కొంది. నిజానికి సగటు ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను రెండు డిగ్రీల కంటే తక్కువగా ఉంచాలనే లక్ష్యాన్ని సాధించాలంటే, పారిస్ వాతావరణ ఒప్పందంలో వివిధ దేశాలు వాగ్దానం చేసిన దాని కన్నా ఐదు రెట్లు ఎక్కువ కార్బన్ ఉద్గారాలను తగ్గించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

నిజానికి కోవిడ్ మహమ్మారి తలెత్తక ముందే అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఈ కరోనావైసర్ దెబ్బకు కుప్పకూలిన తమ ఆర్థిక వ్యవస్థల్ని తిరిగి గాడిలో పెట్టేందుకు వివిధ దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా కర్బన ఉద్గారాల శాతం మరింత పెరగవచ్చన్న భయాలు అంతటా నెలకొన్నాయి.

ఆర్థిక వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడంలో భాగంగా ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. అందులో పర్యావరణ అనుకూల విధానల గురించి, అలాగే కర్బన ఉద్గారాలను వీలైనంత తగ్గించాలన్న ప్రస్తావనలు చేస్తున్నప్పటికీ మున్ముందు వాతావరణ పరిస్థితులు మరింత దుర్భరంగా మారవచ్చన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

1951 నుంచి 2015 మధ్య కాలంలో నైరుతి రుతుపవనాల కారణంగా కురిసే వర్షపాతం సుమారు 6శాతం తగ్గిందని, ముఖ్యంగా గంగా-సింధు మైదాన ప్రాంతం, పశ్చిమ కనుమల్లో ఈ ప్రభావం ఉందని భారత వాతావరణ నివేదిక వెల్లడించింది.

అలాగే 1901 నుంచి 2018 మధ్య కాలంలో దేశంలోని ఉష్ణోగ్రతల సరాసరి 0.7సెంటీగ్రేడ్ మేర పెరిగిందని నివేదిక తెలిపింది.

1951-2016 మధ్య కాలంలో తరచుగా కరవు పరిస్థితులు తలెత్తడమే కాదు.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరిచడం పెరుగుతూ వచ్చింది.OR (దాని ప్రాదేశిక పరిధి కూడా గణనీయంగా పెరుగుతూ వచ్చింది.)

గడిచిన రెండు దశాబ్దాల కాలంలో రుతుపవనాల తర్వాత కూడా తీవ్రమైన తుపానులు తరచుగా వచ్చాయని నివేదిక తెలిపింది.

ఆర్థిక వ్యవస్థల్ని పునరుద్ధరించడంలో భాగంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొనే తగిన తెలివైన విధానాలను రూపొదించాలన్న ఆలోచనకు అన్ని దేశాల అధినేతలు మద్దతిస్తున్నారు. అప్పుడే ఎంతో కొంత పర్యావరణ సంక్షోభాన్ని తగ్గించగలమని భావిస్తున్నారు.

అయితే ఈ విషయంలో చాలా దేశాలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయే తప్ప చేతల్లో చూపించడం లేదు. అందుకు ప్రధాన కారణం కోవిడ్-19 సృష్టించిన ఆర్థిక సంక్షోభం. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం కరోనవైరస్ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రపంచంలో 50 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు సుమారు 12 ట్రిలియన్ డాలర్లను కేటాయించాయి. అయితే అందులో కనీసం 0.5శాతం కూడా పర్యావరణ అనుకూల ఆర్థిక కార్యకలాపాల లక్ష్యంగా కేటాయింపులు జరగలేదు.

బొగ్గు గని కార్మికులు

బొగ్గు మైనింగ్ సదుపాయాలకు రూ.50 వేల కోట్లు

"బొగ్గు ఉత్పత్తిని పెంచడం ద్వారా విద్యుత్, ఉక్కు, అల్యూమినియం, సిమెంట్, ఎరువుల ఉత్పత్తిని పెంచవచ్చు" అని గత వారంలో 41 బొగ్గు గనుల్లో కమర్షియల్ మైనింగ్ అనుమతి ఇచ్చిన సందర్భంలో భారత ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.

2018 సంవత్సరంలో భారత్ సుమారు 675 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. దేశంలో 70శాతానికి పైగా విద్యుత్ ఉత్పత్తి బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారానే జరుగుతోంది.

దేశంలోని మొత్తం 16 జిల్లాల్లో భారీ ఎత్తున బొగ్గు గనులు ఉన్నాయన్నారు మోదీ. ఆ బొగ్గును వెలికి తీసేందుకు తగిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సుమారు రూ.50వేల కోట్ల రూపాయలను పెట్టుబడులు పెడతామని వెల్లడించారు.

అంతేకాదు పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా గనుల నుంచి వెలికి తీసిన బొగ్గును గ్యాస్‌గా మారుస్తామని చెప్పారు.

అయితే అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికే అందుబాటులో ఉందా.. ఒక వేళ ఉంటే అది భరించదగ్గదేనా అన్నవి ఇప్పుడు ఉత్పన్నమవుతున్న కొత్త ప్రశ్నలు.

బ్యాంకుల నుంచి సరైన సమయంలో సాయం అందలేదని ఆపై కరోనావైరస్ సంక్షోభం తదితర కారణాలను చూపిస్తూ భారతీయ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తమ ప్లాంట్ల నుంచి వెలువడే విషవాయువుల్ని తగ్గించేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించాలని అభ్యర్థించారు.

"గతంలో తక్కువ కాలుష్యం వెదజల్లే బొగ్గు వెలికి తియ్యడానికి మాత్రమే అనుమతిచ్చినప్పటికీ ఈ సారి మాత్రం అలాంటి నిబంధనలేం విధించలేదు. మైనింగ్ చేసే వాళ్లు ఎటువటి బొగ్గునైనా వెలికి తియ్యవచ్చు, అమ్ముకోవచ్చు" అని దక్షిణాసియాలోని క్లైమేట్ యాక్షన్ నెటవర్క్‌కి చెందిన సీనియర్ సలహాదారు శైలేంద్ర యశ్వంత్ తెలిపారు.

"ఇదే ఇప్పుడు అత్యంత ఆందోళన కల్గించే విషయం. ఎందుకంటే భారత్‌లో తక్కువ నాణ్యత ఉన్న బొగ్గు ఎక్కువగా దొరుకుతుంది. దాని వల్ల కర్బన ఉద్గారాలు ఎక్కువై వాయు కాలుష్యం పెరుగుతుంది. అది కూడా మున్ముందు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ మొదటిసారిగా భారత్ నివేదిక విడుదల చేసిన ఈ సమయంలో ప్రభుత్వం బొగ్గు తవ్వకాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం మరింత ఆందోళన కల్గించే విషయం" అని శైలేంద్ర అభిప్రాయపడ్డారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+