ప్రధాని నరేంద్ర మోడీ సలహాదారుగా అమిత్ ఖరే నియామకం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి అమిత్ ఖరే నియమితులయ్యారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన సెప్టెంబర్ నెలలో పదవీ విరమణ పొందారు. రెండేళ్లపాటు కాంట్రాక్ట్ బేసిస్లో ఆయన పీఎంవోలో ప్రధాని సలహాదారుగా కొనసాగుతారని సిబ్బంది, వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది.
అమిత్ ఖరే 1985 బ్యాచ్ బీహార్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి. కాగా, రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పలు హోదాల్లో ఆయన కీలకంగా వ్యవహారించారు. సెప్టెంబర్ 30న పదవీ విరమణ పొందారు. పీఎంవోలో ప్రధానికి సలహాదారుగా ఆయన నియామకాన్ని కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం 2020 రూపకల్పనలోనూ అమిత్ ఖరే మంచి సహకారం అందించారు. 2018 మే నుంచి 2019 మే డిసెంబర్ వరకు కేంద్ర సమాచారా, ప్రసాదర మంత్రిత్వశాఖ కార్యదర్శిగా ఆయన పనిచేశారు. ఈ సమయంలో డిజిటల్ మీడియా కీలక నిబందనల రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషించారు.
ఇక 1990ల కాలంలో ఉమ్మడి బీహార్ రాష్ట్రంలో పశుసంవర్థక శాఖలో డిప్యూటీ కమిషనర్గా పని చేసిన ఆయన.. దేశంలోనే సంచలనం సృష్టించిన దాణా కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. దీంతో ఆయన దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.
కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకున్న కేవీ సుబ్రమణియన్
కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సీఈఏ) ఉన్న కృష్ణమూర్తి సుబ్రమణియన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. తన మూడేళ్ల పదవీ కాలం పూర్తైన సందర్భంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఇక పరిశోధన, విద్యా ప్రపంచం వైపు తిరిగి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు డాక్టర్ కేవీ సుబ్రమణియన్ తెలిపారు. ప్రభుత్వంలో మూడేళ్లపాటు పనిచేసిన కాలంలో అద్భుతమైన ప్రోత్సాహం, మద్దతు లభించాయి. కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు, కీలక వ్యక్తులతోనూ స్నేహపూర్వక సంబంధాన్ని ఆస్వాదించాను. ఈ క్రమంలో దేశానికి సేవ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని కృష్ణమూర్తి సుబ్రమణియన్ పేర్కొన్నారు.
అంతేగాక, దాదాపు మూడు దశాబ్దాల వృత్తి జీవితంలో ప్రధాని నరేంద్ర మోడీ వంటి స్ఫూర్తిదాయకమైన నాయకుడిని ఎన్నడూ చూడలేదని కేవీ సుబ్రమణియన్ తెలిపారు. కేవలం ప్రధాని మోడీనే కాకుండా ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్, ఆ విభాగంలోని ఇతర ఉన్నతాధికారులతో పదవీ కాలంలో తనకు ఎదురైన అనుభవాలను కేవీ సుబ్రమణియన్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
కాగా, 2018 డిసెంబర్ 7న కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా కేవీ సుబ్రమణియన్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆ పదవిలో ఉన్న అరవింద్ సుబ్రమణియన్ వైదొలిగిన ఐదు నెలలకు కేవీ ఆ బాధ్యతలు చేపట్టారు. తాజాగా సీఈఏగా మూడేళ్ల పదవీకాలం ముగియడంతో కేవీ సుబ్రమణియన్ బాధ్యతల నుంచి నిష్క్రమిస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై విద్యా సంస్థల్లో పరిశోధనలవైపు తన పయనాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు సుబ్రమణియన్.