తమిళనాడులో బీజేపీదే అధికారం: అమిత్ షా
త్వరలో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని.. తమిళనాడులో అధికారంలోకి వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 2024, 2025 లో పలు రాష్ట్రాల్లో విజయం సాధించిన విధంగానే ఈ సారి తమిళనాడు, బెంగాల్ లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అన్నారు.
తమిళనాడులోని ప్రస్తుత ప్రభుత్వం కేవలం తమ సీఎం సీటును కాపాడుకోవడానికి మాత్రమే ఆలోచన చేస్తున్నారని ప్రజలకు అందించాల్సిన పథకాలపై వారికి ఆసక్తి లేదని ఎద్దేవా చేశారు. తమిళనాడులో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం పుదుక్కోట్టై లో జరిగిన బీజేపీ ర్యాలీలో తాజాగా అమిత్ షా పాల్గొన్నారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. హరియాణా రాష్ట్రంలో వరుసగా మూడోసారి విజయం సాధించామని, ఇప్పుడు తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్ లో విజయ దుందుభి మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

" 2024, 2025 లో బీజేపీ విజయ కేతనం ఎగురవేసింది. 2026 లోనూ ఎన్డీఏ కూటమి తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లోనూ అదే ఊపు కొనసాగిస్తాం".. అని అమిత్ షా అన్నారు. ఈ మేరకు తమిళనాడు సీఎం స్టాలిన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ తన సీఎం కుర్చీని కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ ప్రజల సంక్షేమం కోసం ఆలోచించడం లేదని అన్నారు. తమిళనాడులో కుటుంబ పాలనను అంతం చేసే రోజులు దగ్గరకు వచ్చాయని తెలిపారు. మొదట కరుణానిధి, ఆ తర్వాత స్టాలిన్, ఇప్పుడు ఉదయనిధి.. కానీ ఈ సారి మీ అంచనాలు తలకిందులు అవుతాయని అమిత్ షా జోస్యం చెప్పారు.
ఉదయనిధి స్టాలిన్ ను సీఎం సీటులో కూర్చోబెట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తుందని అమిత్ షా అన్నారు. అంతేకాని ప్రస్తుతం రాష్ట్రంలోని సమస్యలపై చర్చించే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ ఏడాదిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అమిత్ షా రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఈ మేరకు ఆదివారం పుదుక్కోట్టై లో జరిగిన బీజేపీ ర్యాలీలో తాజాగా అమిత్ షా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications