ఇందిరనే హిట్లర్: రాహుల్పై దుమ్మెత్తిపోసిన అమిత్షా
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యు) వివాదంపై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా.. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన సోమవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇందిరా గాంధీది హిట్లరిజం కాదా అని నిలదీశారు.
కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిట్లరిజం ఉందన్నారు. రాహుల్ గాంధీ వేర్పాటువాదుల గొంతుకలా మారారని దుయ్యబట్టారు. జెఎన్యులో కొందరు విద్యార్థులు చేసింది ముమ్మాటికీ జాతి వ్యతిరేక చర్యలేనని, వాటిని రాహుల్ గాంధీ సమర్థించడం పూర్తి అవగాహనా రాహిత్యమేనన్నారు.
జాతి వ్యతిరేక వ్యాఖ్యలకు, జాతీయ భావానికి మధ్య తేడా రాహుల్ గాంధీకి తెలియడం లేదన్నారు. ఈ మేరకు తన బ్లాగులో పలు కామెంట్లను పోస్ట్ చేస్తూ, ప్రధాని పాలన హిట్లర్ను తలపిస్తోందని రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
ఎమర్జెన్సీ విధించి ఇందిరా గాంధీయే హిటర్లలా ప్రవర్తించారని విమర్శించారు. ఆమె చర్యలు ఎటువంటివో కాంగ్రెస్ స్వయంగా పరిశీలించుకోవాలని ఎద్దేవా చేశారు. హిట్లర్ బుద్దులు కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉన్నాయన్నారు. వర్శిటీకి వెళ్లి వేర్పాటు వాదుల అద్దె గొంతుకలా ఆయన మాట్లాడటం పూర్తి అవగాహనా రాహిత్యమని విమర్శించారు.
మోడీ పాలన జర్మనీలో హిట్లర్ పాలనను తలపిస్తోందని రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. వాటిపా అమిత్ షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ భారత్ విభజనను కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు.
కాగా, టెర్రరిస్ట్ అఫ్జల్ గురుకు మద్దతుగా కొందరు విద్యార్థులు జెఎన్యులో సభ నిర్వహించారు. దీనిపై ప్రభుత్వం మండిపడింది. మాజీ సైనికులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. టెర్రరిస్ట్కు మద్దతుగా కొందరు విద్యార్థులు సభ నిర్వహించడం సైనికులను అవమానించడమేనని అభిప్రాయపడుతున్నారు.