నితీష్తో భేటీ కానున్న అమిత్ షా... సీట్ల పంపకాలపై చర్చ..?
బీహార్లో బీజేపీ జేడీయూల మధ్య పొరపచ్చాలు వచ్చాయని వార్తలు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బీహార్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం పాట్నాకు చేరుకుని పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు. 2017లో నితీష్ కుమార్ పార్టీ జేడీయూ తిరిగి ఎన్డీఏ గూటికి చేరిన తర్వాత తొలిసారిగా అమిత్ షా బీహార్లో పర్యటిస్తుండటంతో ఈ పర్యటనకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
మరో వైపు గురువారం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అమిత్ షా... రాత్రి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవ్వనున్న విందుకు హాజరుకానున్నారు. అక్కడ రానున్న లోక్సభ ఎన్నికలపై చర్చ జరిగే అవకాశముంది. పొత్తుతో కలిసి వెళుతున్నందున ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలో అనే అంశంపైనా చర్చ జరిగే అవకాశముంది. అయితే అమిత్ షా పర్యటన సందర్భంగా జేడీయూ ప్రతినిధులకు ఆ పార్టీ స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ మీడియా ముందుకొచ్చి లోక్సభ సీట్ల పంపకాలపై మాట్లాడకూడదని హుకూం జారీ చేసింది.
2014 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి బీహార్లో 31 సీట్లు వచ్చాయి. అయితే ఎవరికి వారే తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. అయితే ఆ సమయంలో లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీచేసిన జేడీయూకు 2 స్థానాలు మాత్రమే వచ్చాయి. తాజాగా జేడీయూ తిరిగి ఎన్డీఏ కూటమిలోకి చేరడంతో సీట్ల పంపకాలు నిజంగానే చాలా కష్టతరంగా మారే అవకాశముంది. అయితే సీట్ల పంపకాల్లో అమిత్ షా ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తారో ఆసక్తికరంగా మారింది.