మోడీతో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ మంతనాలు..రైతులతో చర్చల వేళ డిస్కషన్స్...
వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, పంటకు కనీస మద్దతు ధర కోసం అన్నదాతల నిరసన కొనసాగుతోంది. రైతుల ఆందోళనలు దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగడంతో యావత్ ప్రపంచం వారి దృష్టి పడింది. రైతుల డిమాండ్లపై ఇప్పటికే ప్రభుత్వం రెండు విడతలు చర్చ జరిగాయి. అయితే హామీలపై స్పష్టత లేకపోవడంతో రైతుల అజిటేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కాసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు.
మరికొద్దీ గంటల్లో రైతులతో ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరుగుతున్న సమయంలో మోడీతో అమిత్ షా, రాజ్ నాథ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. వీరితో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా ఉన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళనకు దిగారు. పంటలకు మద్దతు ధర, వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్ధిరీకరణ అంశంపై పీటముడి నెలకొంది.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైందనే వార్తల నేపథ్యంలో వేలాది మంది రైతులు గుమికూడటం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ మరింత స్ప్రెడ్ అవుతుందనే అనుమానం వ్యక్తమవుతోంది. దేశంలో ఇప్పటికే 95 లక్షల మందికి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. అయితే వైరస్ సోకడంతోపాటు.. రికవరీ రేటు కూడా అదేస్థాయిలో ఉంది. దీంతో ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతోపాటు రెండు, మూడు నెలల్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. ఇదీ కాస్త ఊరట కలిగించే అంశం.