బీజేపీకి 2014 విజయనామ సంవత్సరం... పీడీపీ, ఎన్సీతో పొత్తుకు సిధ్ధం: అమిత్ షా
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీని ఆదరించిన ఓటర్లకు ధన్యవాదాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ విముక్త భారత దేశాన్ని తయారు చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలని చెప్పారు. భారతీయ జనతా పార్టీకి 2014 ఎన్నికలు విజయనామ సంవత్సరమని అమిత్ షా పేర్కొన్నారు.
రెండు రాష్ట్రాల్లో ఓటర్లు బీజేపీ, ప్రధాని మోడీ నాయకత్వంపై అంతులేని విశ్వాసం ప్రదర్శించారని అన్నారు. తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. మోడీ ప్రభుత్వ ఆరునెలల పాలన వల్లే ఈ ఎన్నికల్లో విజయం లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. జార్ఖండ్లో కాంగ్రెస్, జేఎంఎం, జేడీ పార్టీల ప్రముఖ నేతలను ఓడించి ప్రజలకు ఏం కావాలో స్పష్టం చేశారని అన్నారు.
అలాగే జమ్మూ కాశ్మీర్ లో అత్యధిక ఓట్లు గెలిచిన ఏకైక పార్టీగా బీజేపీ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సేవలో తరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఇక రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందని అన్నారు. జార్ఖండ్లో 24 నుంచి 31.3 శాతం వరకు ఓట్లు పెరిగాయని, 18 స్ధానాల నుంచి 41 స్ధానాలకు ఎదిగామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ రహిత భారతదేశం నిర్మించడమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు.
జమ్మూకశ్మీర్లోనూ బాగానే పుంజుకున్నామని చెప్పారు. అక్కడ కూడా 23 శాతం ఓట్ల సాధించామని తెలిపారు. ఇటీవల ఎన్నికలు జరిగిన పలు రాష్ర్టాల్లో కాంగ్రెస్కు దక్కింది 3 లేదా 4వ స్థానమే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ రహిత భారత్ నిర్మాణానికి ఇదే సూచిక అని వ్యాఖ్యానించారు.
పీడీపీ, ఎన్సీతో పొత్తుకు సిధ్ధం
జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ లేదా నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించాడు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే వారికి బయట నుంచి మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
జమ్మూ కాశ్మీర్లో 25 స్ధానాలు సాధించి బీజేపీ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల మద్దతుని పొందిందని అమిత్ షా వెల్లడించారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో బీజేపీకి మంచి ఆదరణ లభించిందన్నారు.