అజిత్ ను ఒప్పించటంలో కీలక పాత్ర ఆయనదే .. 'మహా' రాజకీయాల్లో చక్రం తిప్పిన అమిత్ షా షాడో !!
మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. రాత్రికి రాత్రే మారిపోయిన రాజకీయ సమీకరణాలకు కారణం బీజేపీకి చెందిన ఓ కీలక నేత అని జోరుగా ప్రచారం సాగుతుంది. ఇంతకీ అజిత్ పవార్ ను తమ వైపుకు తిప్పుకుని , దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎం గా పట్టం కట్టటానికి కీలక భూమిక పోషించిన ఆ నేత అమిత్ షా నమ్మిన బాటు అని తెలుస్తుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనేత రాజస్థాన్ కు చెందిన నేత కావటం విశేషం.
నితిన్ గడ్కరీ నీతి మాటలు నిర్లక్షం చేసిన శివసేన, చెక్, మోదీ, షా వ్యూహంతో పవార్ కు పదవి !
అజిత్ పవార్ ను ఒప్పించటంలో కీలక పాత్ర పోషించిన భూపేంద్ర యాదవ్
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యరీతిలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఎన్సీపీ , కాంగ్రెస్, శివసేనలకు షాక్ ఇచ్చారు . అయితే ప్రభుత్వ ఏర్పాటులో చాపకింద నీరులా వ్యవహరించిన కీలక నేత మాత్రం ఎంపీ భూపేంద్ర యాదవ్ అని జోరుగా చర్చ జరుగుతుంది . రాజస్థాన్ కు చెందిన బీజేపీ నేత భూపేంద్ర యాదవ్ ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
వ్యూహాత్మకంగా పని చక్కబెట్టిన భూపేంద్ర యాదవ్
ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నమ్మినబంటుగా ఉన్న నేత. ప్రభుత్వ ఏర్పాటు తమ వల్ల కాదని బీజేపీ వెనక్కితగ్గడం, ఆ తర్వాత సైలెంట్ గా చాప కింద నీరులా పావులు కదపటం అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది. ఇదంతా వ్యూహాత్మకమేనని ప్రత్యర్థులు గ్రహించేలోపే సీఎం పీఠంపై ఫడ్నవీస్ తమ ఆధిపత్యాన్ని చూపించారు. వారం రోజుల్లో బాల నిరూపణకు సిద్ధం అవుతున్నారు. ఇదంతా సాధ్యం అయింది అంటే అందుకు ప్రధాన కారణం భూపేంద్ర యాదవ్.
గత కొన్ని రోజులుగా రహస్య మంతనాలు ... ఫైనల్ గా ఒప్పించిన రాజస్థాన్ నేత
గత కొన్నిరోజులుగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ తో, భూపేంద్ర యాదవ్ రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా జరుగుతున్న చర్చల్లో నిన్న రాత్రి బీజేపీ, అజిత్ పవార్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భూపేంద్ర కీలకభూమిక వహించారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న శరద్ పవార్ అంతటివాడు కూడా కనీసం ఏం జరుగుతుందో పసిగట్టలేకపోవటం చూస్తే ఎంత వ్యూహాత్మకంగా పని జరిపించారో అర్ధం చేసుకోవచ్చు .
అమిత్ షా మరో సర్జికల్ స్ట్రైక్ ..
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కే తెలీకుండా సొంత పార్టీలో చీలిక వచ్చిందంటే భూపేంద్ర యాదవ్ ఏ స్థాయిలో చక్రం తిప్పారో అర్థం చేసుకోవచ్చు. అనూహ్యంగా మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన క్రెడిట్ అంతా భూపేంద్రకే దక్కుతుంది. ఒక లెక్కలో చెప్పాలంటే అమిత్ షా భూపేంద్ర యాదవ్ తో మరో సైలెంట్ సర్జికల్ స్ట్రైక్ చేయించారని చెప్పొచ్చు .
ఎన్సీపీలో సైలెంట్ గా చిచ్చు పెట్టిన భూపేంద్ర యాదవ్
నిన్నటి వరకు కాంగ్రెస్, ఎన్సీపీ , శివసేన కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావించగా ఊహించని విధంగా రాత్రికి రాత్రే రాజకీయాల్లో పరిణామాలు మారిపోయాయి. అమిత్ షా నమ్మినబంటు భూపేంద్ర యాదవ్ చక్రం తిప్పి ఎంసీపీని రెండుగా చీల్చారు. తాజా పరిణామాలతో భూపేంద్ర యాదవ్ ఇప్పుడు పెట్టిన చిచ్చు మహా రాజకీయాల్లో భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుందో వేచి చూడాలి.