Amit Shah: గంట టైమిస్తే బిల్లు మార్చి తెస్తా-అమిత్ షా సవాల్..!
లోక్ సభతో పాటు దేశవ్యాప్తంగా చట్ట సభల్లో సీట్ల పెంపుపై పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై ఇవాళ హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సమాధానం ఇచ్చారు. ఇందులో ఆయన విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో ప్రతీ రాష్ట్రంలోనూ 50 శాతం సీట్ల పెంపు కచ్చితంగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే బిల్లులో ఆ విషయం ఎందుకు పెట్టలేదన్న విపక్షాల ప్రశ్నపై స్పందిస్తూ.. గంట సమయం ఇస్తే బిల్లులో మార్పులు చేసి తెస్తామంటూ సవాల్ విసిరారు.
ఇండియా కూటమికి చెందిన ప్రతి ఒక్క ఎంపీ మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నారని లోక్ సభలో అమిత్ షా విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు విపక్షాలు వ్యతిరేకమన్నారు. డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్న వారంతా ఎస్సీ ఎస్టీ సీట్ల పెంపును కూడా వ్యతిరేకిస్తున్నట్లే అర్థం అన్నారు. 20 లక్షల ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో 127 లోక్సభ స్థానాలు వస్తాయని, జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఒక ఎంపీ అక్కడి సమస్యలను ఎలా పరిష్కరించగలరని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ సభాసమయాన్ని వృథా చేశారని అమిత్ షా ఆరోపించారు.

2021లో కరోనా వల్ల జనగణన చేయలేకపోయామని, 2024లో చేయాలని భావించినప్పుడు చాలామంది కుల ఆధారిత గణన కోరారని అమిత్ షా గుర్తుచేశారు. 2025లో కులగణనతో కూడిన జనగణన చేయాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. విపక్షాలకు కులగణనపై ఆసక్తి లేదని, అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఆరోపించారు. కేవలం అధికారంలోకి రావాలనే వారి కలలు నిజమయ్యేలా కనిపించడం లేదన్నారు. కులగణనపై విపక్షాలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. డీలిమిటేషన్కు మద్దతు ఇస్తే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఓటుకు విలువ ఉంటుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు. ప్రతి రాష్ట్రం నుంచి సమాన ప్రాతినిథ్యం పార్లమెంటులో ఉంటుందని షా తెలిపారు. తనకు గంట సమయం ఇస్తే..రాష్ట్రాల్లో 50శాతం సీట్ల పెంపుతో సవరణ చేసి తీసుకొస్తానని విపక్షాలకు తేల్చిచెప్పారు.













Click it and Unblock the Notifications