పాల ధరల పొంగు: లీటర్పై పెరిగిన రేటు ఇదీ: రేపట్నుంచే అదనపు భారం
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధం ప్రభావం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వస్తాయనే ప్రచారం దేశంలో కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోంది. ఈ యుధం వల్ల ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ రేటు వంద డాలర్లను దాటేసింది. ఇందులో హెచ్చుతగ్గులు నమోదవుతున్నప్పటికీ.. ఇదివరకట్లా స్థిరత్వం కనిపించట్లేదు. క్రూడాయిల్కు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుదల బాట పట్టొచ్చనే ప్రచారం సాగుతోంది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు షురూ: అజెండా ఇదే: ఉత్కంఠతతో ప్రపంచ దేశాలు
దీనికి ఆరంభ సూచకంగా ఇదివరకే వంటనూనెల రేట్లు కూడా భారీగా పెరిగాయి. సలసలమంటూ కాగుతున్నాయి. వంటనూనెల రేట్లల్లో లీటర్ ఒక్కింటికి 20 నుంచి 40 రూపాయల వరకు పెరుగుదల కనిపించింది. ఇప్పుడు తాజాగా పాల వంతు వచ్చింది. పాల రేట్లు పెరగనున్నాయి. దేశంలోనే అతిపెద్ద పాల సేకరణ సమాఖ్య అమూల్.. తన ధరలను సవరించింది. పాల రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.
లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల మేర పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. పెరిగిన ధరలు మార్చి 1వ తేదీ నుంచి అంటే- మంగళవారం నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. అన్ని రకాల వేరియంట్లకూ పెరిగిన ధరలను వర్తింపజేసింది అమూల్. గోల్డ్, తాజా, శక్తి, టీ-స్పెషల్ వంటి వేరియంట్లు ప్రస్తుతం అమూల్లో అందుబాటులో ఉన్నాయి. ఆవు, గేదె పాలను విక్రయిస్తోందా సమాఖ్య.
పెంచిన రేట్ల ప్రకారం చూసుకుంటే- మంగళవారం నుంచి అమూల్ గోల్డ్ అర లీటర్ పాల ధర 30, తాజా బ్రాండ్ అర లీటర్ 24, శక్తి అర లీటర్ 27 రూపాయలకు లభిస్తాయని తెలిపింది. అమూల్ పాల ధరలు పెరగడం ఏడు నెలల తరువాత ఇదే తొలిసారి. గత సంవత్సరం జులైలో చివరిసారిగా అమూల్ సమాఖ్య తన పాల రేట్లను పెంచింది. పాల సేకరణ రేట్లను పెంచాల్సి రావడం వల్ల అదనంగా పడిన భారాన్ని వినియోగదారులపై నామమాత్రంగా మోపినట్లు వివరించింది. అమూల్ పాలసీ ప్రకారం- పాలను విక్రయించడం వల్ల వచ్చే ప్రతి రూపాయిలో దాదాపు 80 పైసలను పాడి రైతులకు చెల్లిస్తుంది.