అసోంలో బంద్ హింసాత్మకం: కర్ఫ్యూ..ఇంటర్నెట్ సేవలు నిలిపివేత: బలగాల తరలింపు..!
వివాదాస్పద పౌరసత్వ బిల్లు పైన అసోం అట్టుడుకుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ బిల్లు ఆమోదం పొందింది. ఇదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అసోంలో కర్ఫ్యూ విధించారు. అసోంలోని పది జిల్లాల్లో బుధవారం రాత్రి 7 నుంచి 24 గంటలపాటు ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం చేపట్టిన బంద్ అనేక చోట్ల హింసాత్మకంగా మారింది. లక్షలాది మంది రోడ్ల మీదికి వచ్చి తమ నిరసనను తెలియజేశారు. దీంతో..అసోంతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో అదనంగా ఐదువేల మంది పారామిలిటరీ సిబ్బందిని తరలించారు.

అసోంలో కర్ఫ్యూ..ఇంటర్నెట్ సేవలు కట్
పౌరసత్వ సవరణ బిల్లు ఆందోళనలు అసోంలో తీవ్ర రూపం దాల్చాయి. భారీగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు కొనసాగిస్తున్నారు. అసోంలో కొనసాగుతున్న బంద్ కు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియ న్, నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నేతృత్వం వహించగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఏఐడీడబ్ల్యూఏ, ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్ఏ తదితర విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. నిరసనల తీవ్రత పెరుగుతున్న నేప థ్యంలో అసోంలోని పది జిల్లాల్లో బుధవారం రాత్రి 7 నుంచి 24 గంటలపాటు ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. గుహవాటిలో బుధవారం సాయంత్రం 6:15 గంటల నుంచి గురువారం ఉదయం 7 గంటలవరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. పరిస్థితిని అంచనా వేస్తున్న కేంద్రం అసోంకు అదనంగా పారా మిలిటరీ బలగాలను పంపింది. అయినా ఆందోళన కారులు నిరసన ప్రదర్శనల ద్వారా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు.

గాల్లోకి కాల్పులు..పలు రైళ్ల రద్దు
బంద్ నిర్వహిస్తున్న సమయంలో అసోంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు. రోడ్లు, రైల్వే ట్రాకులపై టైర్లను వేసి నిప్పంటించారు. ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్యంగా అసోం, త్రిపురల్లో నిరసనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రకటనలున్న బ్యానర్లను, హోర్డింగులను కిందికి లాగి ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల బా ష్పవాయు గోళాలనూ ప్రయోగించారు. గువాహటిలో సచివాలయాన్ని ముట్టడించేందుకు పెద్దసంఖ్యలో విద్యార్థులు యత్నించారు. అన్నివైపులనుంచి దూసుకొచ్చి బారికేడ్లను ధ్వంసం చేశారు. వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి టియర్ గ్యాస్ ప్రయోగించారు. సీఎం సోనోవాల్ సొంత పట్టణమైన చబువాలో విద్యార్థులు భారీ ర్యాలీ చే పట్టారు. జోరాట్, డిబ్రూగఢ్లో నిరసనకారులు రైల్వే ట్రాక్లను దిగ్భందించారు. లక్వాలో నిరసనకారులు చమురు శుద్ధి కేంద్రాల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. అసోం రాజధాని దిస్పూర్లో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నిరసనల నేపథ్యంలో ఈశాన్య రైల్వే 14 రైళ్లను రద్దు చేసింది.

ఎయిర్పోర్ట్లో చిక్కుకున్న అసోం సీఎం
పౌరసత్వ సవరణ బిల్లుపై ఎగిసిపడుతున్న ఆగ్రహ జ్వాలలతో అసోం సీఎం సోనోవాల్ గువాహటి ఎయిర్పోర్ట్లోనే చిక్కుకున్నారు. నగరంలో భారీ ఆందోళనల నేపథ్యంలో బయటకు వెళ్లడం మంచిది కాదని పోలీసులు చెప్పడంతో ఆయన విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కాగా.. మణిపూర్ను కూడా ఇన్నర్ లైన్ పర్మిట్(ఐఎల్పీ) వ్యవస్థ పరిధిలోకి తెస్తూ రాష్ట్రపతి కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అక్కడి ప్రజలు ఆందోళనలు నిలిపివేశారు. ఇక నాగాలాండ్ లో నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్వంలో వందలాది మంది నిరసనకారులు రాజ్భవన్ను ముట్టడించారు. మేఘాలయలో ఖాసీ స్టుడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా, దుకాణాలను మూసివేశారు. మావ్లాయ్ ప్రాంతంలో నిరసనకారులు పలు వాహనాలను ధ్వంసం చేశారు.

ఐదువేల మంది సైన్యం తరలింపు
ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితిని అదుపుచేసేందుకు కేంద్రం బుధవారం 5,000 మంది పారామిలిటరీ దళాలను విమానాల్లో తరలించింది. ఇందులో 2వేల మందిని కశ్మీర్ నుంచి తరలించారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కేంద్రం కశ్మీర్కు పెద్దఎత్తున బలగాలను తరలించింది. వారు అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. తాజాగా 2వేల మందిని కశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు తరలించారు. మరో 3 వేల మందిని ఇతర రాష్ట్రాల నుంచి అసోంకు పంపారు. పరిస్థితులను అంచనా వేస్తున్నామని..పరిస్థితి అదుపులో ఉందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications