రాహుల్ అస్త్ర సన్యాసం చేసినా: ప్రజలు మాత్రం కాంగ్రెస్ ను వదల్లేదు: జాగ్రత్తలు తీసుకొని ఉంటే..!
2014 ఎన్నికల కంటే..2019 ఎన్నికల్లో బీజీపీకి పెరిగిన సీట్లు. ఆర్టీకల్ 370 రద్దు ద్వారా దేశ వ్యాప్తంగా పెరిగిన మద్దతు. ఇదే అస్త్రంగా మహారాష్ట్ర..హర్యానా ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రచారం. మరో వైపు సరిగ్గా పోలింగ్ ముందు రోజు జరిగిన ఉగ్రవాద శిబిరాలపై దాడులు. ఇవన్నీ చూసిన వారు ఈ పరిణామాలు ఖచ్చితంగా బీజేపీకీ మేలు చేస్తాయని..అయిదేళ్లుగా ప్రభుత్వాల్లో ఉన్నా..అంతర్గతంగా సమస్యలు వేధిస్తున్నా యాంటీ ఎస్టాబ్లిష్ మెంట్ ను కాదని..ఏకపక్షంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసారు. కానీ, మహారాష్ట్రలో బలం తగ్గింది. మిత్రపక్షం శివసేన బలం గతం కంటే పెరిగింది. కాంగ్రెస్..ఎన్సీపీ లు పోటీ బాగానే ఇచ్చారు.
అక్కడ ఎంఐఎం వంటి పార్టీలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. ఇక..హర్యానా లో కర్నాటక తరహా రాజకీయం కళ్ల ముందు కనిపిస్తోంది. దీని ద్వారా బీజేపీకి జాతీయ స్థాయిలో పట్టం కడుతున్న ప్రజలు..రాష్ట్ర స్థాయిలో మాత్రం అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. ఇదే సమయంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ఇంకా ఆదరిస్తున్నారు. కానీ, ఆ నమ్మకం రాహుల్ లో మాత్రం కనిపించటం లేదు. అదే రాహుల్ ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేయకుండా ఉండి ఉంటే..ఫలితాల్లో మరి కొంత మార్పు కనిపించేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ను ప్రజలు వదలిలేయలేదు..
కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో తమకు తిరుగులేదంటూ విజయాల పరంపర కొనసాగిస్తున్న బీజేపీ నేతలకు మహారాష్ట్ర..హర్యానాలో వస్తున్న ట్రెండ్స్ కొత్త హెచ్చరికలు చేస్తున్నాయి. మహారాష్ట్రలో అధికారం ఖాయమైనా..అక్కడ శివసేన కంట్రోల్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇక, హర్యానాలో కర్నాటక తరహా రాజకీయ మొదలైంది. బీజేపీ అధికారం అంచుల్లో నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దుష్యంత్ చౌతాలా ఎవరి వైపు మొగ్గుతే వారే అధికారంలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. లేదా 31 ఏళ్ల దుష్యంత్ కాంగ్రెస్ మద్దతుతో సీఎం అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఆ దిశగా ఇప్పటికే కాంగ్రెస్ మంతనాలు ప్రారంభించింది. కాంగ్రెస్ లక్ష్యం బీజేపీకి అధికారంలోకి రాకుండా అడ్డుకోవటమే.
దీని పైన పూర్తి ఫలితాలు వెల్లడయిన తరువాత సీఎం ఎవరనేది తేలనుంది. దీని ద్వారా అటు మహారాష్ట్ర..ఇటు హర్యానా ఎన్నికల ఫలితాల సరళి గమనిస్తే..కాంగ్రెస్ ను ప్రజలు బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా వదిలేయలేదనే విషయం స్పష్టం అవుతోంది.
రాహుల్ మాత్రం నమ్మటం లేదు..
2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తరువాత బీజేపీలో మరింత జోష్ పెరిగింది. ఇక తమకు తిరుగులేదనే భావన కనిపించింది. ఫలితంగా అమిత్ షా ను పార్టీ వ్యవహారాల నుండి ప్రభుత్వంలోకి తీసుకున్నారు. ఆ తరువాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేయటం ద్వారా కలిసి వస్తుందని అంచనా వేసారు. అదే సమయంలో రాహుల్ గాంధీ ముందుగానే అస్త్ర సన్యాసం చేసారు. ఎన్నికల సమయంలో దగ్గరలో ఉండీ పార్టీని నడిపించాల్సిన నేత విదేశాలకు వెళ్లిపోయారు.
తాను లేకపోయినా ప్రియాంకను ప్రచారంలోకి దింపినా.. ఫలితాలు మరింత ఆశాజనకంగా ఉండేవి. ఇక, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలే స్థానిక పరిస్థితులను అనుగుణంగా వ్యూహాలు అమలు చేసారు. బీజేపీ నేతలు..చివరకు కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేయలేని విధంగా ఫలితాలు రాబట్టారు. అదే మరింతగా రాహుల్ చొరవ తీసుకొని ఉంటే బీజేపీకీ మరింతగా షాక్ తగిలే పరిస్థితులు ఏర్పడవేమో. ఇప్పుడు వస్తున్న ఫలితాల ట్రెండ్స్ దాదాపుగా అదే స్పష్టం చేస్తున్నాయి.
బీజేపీ సమీక్షించకోవాల్సిందేనా..
2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయంతో..మోదీ..షా ద్వయం తిరుగులేని నేతలుగా ఎదిగారు. కానీ, ఆ తరువాత జరిగిన ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రం పరిస్థిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడైతే పోటీలేని పార్టీగా బీజేపీ కనిపించిందో..అక్కడే గట్టి పోటీ ఎదుర్కోంది.అయితే, జాతీయ స్థాయిలో బీజేపీని..రాష్ట్ర స్థాయిలో మాత్రం పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు వ్యవహరిస్తున్నారనే అంశం స్పష్టమవుతోంది.
ప్రభుత్వం మీద సహజంగా ఉండే వ్యతిరేకత కారణంగానే ఈ ఫలితాల్లో కొంత ట్రెండ్స్ మారాయనే అభిప్రాయం బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అధికారం దక్కించుకున్నా.. ఖచ్చితంగా బీజేపీ నేతలు తాజా ఫలితాల ఆధారంగా క్షేత్ర స్థాయి పరిస్థితులు వాస్తవాలకు ఆధారంగా సమీక్షించుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్న మాట.