అందుకే ఆ 80 గంటలు సీఎంగా ఫడ్నవీస్..బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ హెడ్గే
ముంబై: బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ హెడ్గే బాంబు పేల్చారు. దేవేంద్ర ఫడ్నవీస్ 80 గంటల ముఖ్యమంత్రిగా ఎందుకున్నారో ఎందుకు ఉండాల్సి వచ్చిందో దాని వెనకున్న రహస్యం చెప్పేశారు. ఇంతకీ అనంతకుమార్ హెడ్గే చెప్పిన రహస్యం ఏమిటి..? అది నిజమేనా అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సంచలన ఆరోపణలు చేసిన హెడ్గే
మహారాష్ట్ర రాజకీయా ప్రతిష్టంభనకు తెరపడింది. ఉద్ధవ్ థాక్రే సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంతో నెలరోజులకు పైగా సాగిన హైడ్రామాకు తెరపడింది. హైడ్రామాకు తెరపడింది కానీ.. మాజీ ముఖ్యమంత్రి దేవీంద్ర ఫడ్నవీస్ను మాత్రం ఇరకాటంలోకి నెట్టేసింది. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్గా నిలచే బీజేపీ సీనియర్ ఎంపీ అనంతకుమార్ హెడ్గే సంచలన ఆరోపణలు చేశారు. సంఖ్యాబలం లేకుండానే బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఎందకు ముందడుగు వేసిందని అంతా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో అనంత్కుమార్ హెడ్గే సమాధానం ఇచ్చారు.
ఆ నిధులు వెనక్కు పంపేందుకే సీఎంగా ఫడ్నవీస్
అభివృద్ధి పనుల కోసం కేటాయించిన కేంద్రం నిధుల నుంచి రూ.40వేల కోట్లు వినియోగించుకునేందుకు సీఎంకు అధికారం ఉంటుందని చెప్పిన హెడ్గే.. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు ప్రభుత్వంలోకి వస్తే అభివృద్ధి పేరుతో ఆ నిధులను దుర్వినియోగం చేస్తాయని దేవేంద్ర ఫడ్నవీస్ ముందే గ్రహించారని చెప్పారు. ఈ క్రమంలోనే ఈ నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకే డ్రామా ఆడారని వెల్లడించారు అనంత్ హెడ్గే. 15 గంటల్లోనే సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారని వెంటనే ఆ రూ.40వేల కోట్ల నిధులను తిరిగి కేంద్రంకు పంపించారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు హెడ్గే.
అనంత్ కుమార్ వ్యాఖ్యలు సత్యదూరం
అనంత్కుమార్ హెగ్డే వ్యాఖ్యలపై స్పందించారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. తాను ముఖ్యమంత్రిగా ఉన్న 80 గంటల్లో ఎలాంటి నిధులు కేంద్రంకు పంపలేదని చెప్పారు. అంతేకాదు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా అలాంటి నిర్ణయాన్ని తాను తీసుకోలేదని స్పష్టం చేశారు. అనంతకుమార్ హెడ్గే ఎందుకు అలాంటి ఆరోపణలు చేశారో తనకు తెలియదని చెబుతూ ఆ వ్యాఖ్యలను ఖండించారు ఫడ్నవీస్. అదే సమయంలో అసత్య ప్రచారం చేయకూడదని సూచించారు.
మహారాష్ట్రను బీజేపీ మోసం చేస్తోంది
అనంత్ కుమార్ హెడ్గే చేసిన ఆరోపణలపై శివసేన సీనియర్ ఎంపీ స్పందించారు. మహారాష్ట్ర ప్రజలను బీజేపీ మోసం చేస్తోందని చెప్పారు. సంఖ్యాబలం లేకపోయినప్పటికీ వెనువెంటనే ప్రమాణస్వీకారం ఎందుకు చేశారని రౌత్ ట్విటర్ ద్వారా ప్రశ్నించారు. సొంత పార్టీ నేత అనంత్ కుమార్ వ్యాఖ్యలు నిజమై ఉండొచ్చేమో అని రౌత్ అన్నారు.