విషాదం : విశాఖపట్నంలో కరోనాతో ఏడాదిన్నరి చిన్నారి మృతి
కరోనా మహమ్మారి ఓ ఏడాదిన్నర చిన్నారిని బలి తీసుకుంది. మూడు రోజుల క్రితం జ్వరంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆ చిన్నారి.. ఆ తర్వాత కోవిడ్ బారిన పడింది. పరిస్థితి విషమించడంతో మంగళవారం(ఏప్రిల్ 27) ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అడ్మిట్ చేసే లోపే ఆ చిన్నారి మృతి చెందింది. విశాఖపట్నంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం చౌడుపల్లి గ్రామానికి చెందిన వీరబాబు సీఐఎస్ఎఫ్లో పనిచేస్తున్నారు. ఆయనకు ఏడాది వయసు పాప జ్ఞానిత ఉంది. వీరబాబుకి జ్ఞానితపై అమితమైన ప్రేమ. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆమె నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైంది. అప్పటినుంచి జలుబు,జ్వరం,దగ్గు లక్షణాలతో బాధపడుతోంది. స్థానిక స్థానిక వైద్యుల సూచన మేరకు వీరబాబు జ్ఞానితను సన్రైజ్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స అందించారు. దాదాపు రూ.1లక్ష పైచిలుకు ఫీజు వసూలు చేశారు. కానీ లాభం లేకపోయింది.
ఇదే క్రమంలో చిన్నారికి కోవిడ్ టెస్టులు చేయగా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో మంగళవారం(ఏప్రిల్ 27) విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే లోపే చిన్నారి మృతి చెందింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అంబులెన్సులోనే మృతి చెందింది.చిన్నారి జ్ఞానిత మృతితో ఆమె తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. వారిని చూసి కేజీహెచ్ పరిసరాల్లో ఇతర కరోనా పేషెంట్ల బంధువులు కూడా చలించిపోయారు.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్... ఎంతోమందిని బలితీసుకుంటోంది. రాష్ట్రంలోనూ కరోనా మరణాల సంఖ్య పెరిగింది.నిన్న ఒక్కరోజే 64 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,800కి చేరింది. విజయనగరంలో అత్యధికంగా 8 మంది చనిపోగా, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. చిత్తూరులో ఐదుగురు, కర్నూలు, ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, కడపలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,435 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 11,434 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,54,875కు పెరిగింది.