ఆంధ్రప్రదేశ్: విజయనగరం సిరిమానోత్సవమంటే ఏంటి?
సిరిమానోత్సవానికి నెల రోజుల ముందు నుంచి విజయనగరమంతా ఉత్సవ వాతావరణమే కనిపిస్తుంది.
సిరిమానోత్సవమంటే ఏంటి? బొబ్బిలి యుద్ధానికి సిరిమానోత్సవానికి ఉన్న సంబంధమేంటి? సిరిమానోత్సవం ఎలా మొదలయింది?
స్నేహం, వివాదం, యుద్ధం...
1757 వరకు బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య స్నేహం కొనసాగింది. ఆ సమయంలో బొబ్బిలి రాజుగా రాజా గోపాలకృష్ణ రంగారావు, విజయనగరం రాజుగా పూసపాటి పెద విజయరామరాజు ఉండేవారు.
అయితే ఈ రెండు రాజ్యాల సరిహద్దు వాగుల్లోని నీటి వాడకం విషయంలో వివాదం తలెత్తింది. అది యుద్ధానికి దారి తీసింది. అదే బొబ్బిలి యుద్ధం.
సిరిమానోత్సవానికి దారి తీసిన పరిస్థితులేంటి?
పెద విజయరామరాజు చెల్లెలు పైడిమాంబ మరణమే సిరిమానోత్సవానికి నాంది పలికిందని పైడితల్లి అమ్మవారి ఆలయ అర్చకులు బంటుపల్లి వెంకటరావు బీబీసీకి తెలిపారు.
"పైడిమాంబ చిన్నతనం నుంచి అమ్మవారి భక్తురాలు. యుద్ధం ఇరువంశాలకు మంచిది కాదని అపాలని ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తన అన్న పెద విజయరామరాజును హతమార్చేందుకు జరుగుతున్న కుట్రను తెలియచేసేందుకు బయలుదేరిన పైడిమాంబకు తాండ్రపాపారాయుని చేతిలో పెద విజయరామరాజు మరణించారనే వార్త తెలుస్తుంది".
"యుద్ధం అపేందుకు తాను చేసిన ప్రయత్నాలు వృధా కావడం, ఆ యుద్ధంలోనే తన సోదరుడు మరణించడం ఆమె తట్టుకోలేకపోతుంది. తన మరణంతోనైనా యుద్దానికి ముగింపు పలికి సామరస్యంగా ఉండాలని కోరుకుంటూ...తాను విగ్రహాంగా మారి...దేవిలో ఐక్యమైపోతున్నానని చెప్పి ఆమె పెద్దచెరువులో దూకి మరణిస్తారు. ఇదే సిరిమానోత్సవం జరగడానికి కారణమైన తొలి సంఘటన" అని బంటుపల్లి వెంకటరావు వివరించారు.
ఆరునెలలకు ఒక గుడిలో...
కొందరు జాలర్ల సహాయంతో పైడిమాంబను చెరువు నుంచి వెలికి తీసేందుకు అప్పట్లో పైడిమాంబ అనుచరుడిగా ఉన్న పతివాడ అప్పలనాయుడు ప్రయత్నం చేశారు. పెద్ద చెరువులో పైడిమాంబ విగ్రహారూపంలో కనిపిస్తుంది. దానిని తీసుకుని వచ్చి దగ్గర్లో ఉన్న తోటలో ఒక గుడికట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీనినే ప్రస్తుతం వనంగుడి అని పిలుస్తున్నట్లు వనంగుడి పూజారి ప్రశాంత్ బీబీసీతో చెప్పారు.
ప్రజలను కరువు, వ్యాధుల నుంచి కాపాడేందుకు విగ్రహారూపంలో తాను దొరికిన రోజు నాడే తనకు ప్రతి ఏటా, దసరా తర్వాత వచ్చే మంగళవారం నాడు ఉత్సవం నిర్వహించాలని అమ్మవారు ఆజ్ఞాపించినట్లు స్థానికులు చెబుతారు.
"వనంగుడి అడవిలో ఉండటంతో భక్తులు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని, తనకు మరోచోట గట్టు పై గుడి కట్టాలని అమ్మవారు రాజవంశీకుల కలలో కనపడి చెప్పారని చెబుతారు. దాంతో ప్రస్తుతం ఉన్న మూడు లాంతర్ల సెంటర్ వద్ద మరో ఆలయం కట్టారు. దీనినే చదురుగుడి అంటారు" అని ప్రశాంత్ తెలిపారు.
"అమ్మవారు వెలిసిన వనం గుడి నుంచి ఆశ్వయుజమాసంలో చదురుగుడికి తీసుకుని వెళ్తారు. అక్కడ ఆరు మాసాలు ఉన్న తర్వాత చైత్రమాసంలో ఇక్కడికు తీసుకుని వస్తారు. అంటే వనంగుడిలో ఆరునెలలు, చదురుగుడిలో ఆరునెలలు ఉంటారని భక్తుల నమ్మకం." అని ప్రశాంత్ చెప్పారు.
చింతమాను... సిరిమాను ఎలా మారుతుంది?
సిరిమానోత్సవానికి నెల రోజుల ముందు అమ్మవారు తమ కలలో కనిపించి సిరిమాను చెట్టు ఎక్కడుందో తెలియచేస్తారని సిరిమానును అధిరోహించే పూజారి బంటుపల్లి వెంకటరావు బీబీసీతో చెప్పారు.
ఈయన సిరిమానోత్సవానికి ఏడోతరం పూజారి. పైడిమాంబ విగ్రహాన్ని చెరువులో నుంచి బయటకు తీసిన పతివాడ వంశీయులే ఇప్పటికీ ఈ ఆలయ పూజారులుగా ఉన్నారు.
"చింతచెట్టు మానునే సిరిమానుగా ఉపయోగిస్తాం. ఈ ఏడాది డెంకాడ పంచాయతీ చందకపేట గ్రామంలోని చందకవారి కల్లాలు వద్ద చింతమాను చెట్టు ఉందని అమ్మవారు చెప్పడంతో అక్కడికి వెళ్లి ఆ చెట్లు యాజమానిని అడిగి తీసుకున్నాం. అక్కడ నుంచి పట్టుకొచ్చిన చింతమానును హుకుంపేటలో ఉన్న వడ్రంగులు సిరిమానుగా మారుస్తారు. ఈ సమయంలోనే భక్తులు హుకుంపేటలోనే అమ్మవారికి మొక్కులు చెల్లించడం, చింతమానును సిరిమానుగా మార్చడంలో నీళ్లు, పసుపు చల్లుతూ సహాయం చేస్తారు" అని వెంకటరావు తెలిపారు.
- ఆంజనేయుడి జన్మస్థలంపై కీలక ప్రకటన... 'తిరుమల అంజనాద్రిపై ఉన్న జపాలి తీర్థంలోనే హనుమంతుడు పుట్టాడన్న టీటీడీ’
- అన్నమయ్య: తిరుమల వెంకటేశ్వరస్వామికి తాళ్లపాక వంశస్థులే ఎందుకు కన్యాదానం చేస్తారు
సిరిమాను రూపంలోనే ఎందుకు?
హిందూ ఆలయాల్లో ధ్వజ స్థంభానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. వీటిని చెట్లమానుల నుంచే తయారు చేస్తారు. అయితే పైడితల్లి అమ్మవారికి ఉన్న రెండు ఆలయాలైన వనంగుడి, చదురు గుడిలో ధ్వజస్థంభాలుండవు.
"సాధారణంగా భక్తులు ధ్వజ స్థంభం దర్మనం తర్వాతే ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు. అయితే పైడితల్లి అమ్మవారికున్న రెండు ఆలయాల్లో ధ్వజ స్థంభాలు లేకపోవడంతో...పైడితల్లి అమ్మవారు ధ్వజస్థంభాన్నే సిరిమాను రూపంలో ప్రజల వద్దకు తీసుకుని వెళ్తాం. దానిపై కూర్చున్న పూజరిని అవహించి ఆమె, ప్రజలకు, రాజకుటుంబీకులకు ఆశీర్వాదం అందిస్తారు" అని వెంకటరావు చెప్పారు.
- పాకిస్తాన్లో హిందూ ఆధ్యాత్మిక గురువు సమాధిపై మూక దాడి.. ధ్వంసం
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు? చరిత్ర ఏం చెబుతోంది?
రథానికొక కథ ఉంది
సిరిమానోత్సవంలో ప్రధాన ఆకర్షణ అందమైన రథాలే. సిరిమానుతో పాటే ఈ రథాలను కూడా తయారు చేయడం లేదా మరమ్మత్తులు, రంగులు వేయడం చేసే పని మొదలవుతుంది. ఇదంతా సిరిమాను పూజరి ఇంటి దగ్గరే జరుగుతుంది. ఇక్కడ తయారయ్యే రథాలు, వాటికి వేసే రంగుల వెనుక ఆసక్తికర విషయాలున్నాయి.
సిరిమానోత్సవం అంటే రైతుల పండుగ. అలాగే చిన్నపెద్ద అని తేడా లేకుండా అంతా సమానమే చెప్పే ఉత్సవమే ఇది. అందుకు నిదర్శనం సిరిమానోత్సవంలోని రథాలే అని అంటారు రథాలను తయారు చేసే శ్రీనివాస్.
"సిరిమాను సంబరంలో సిరిమాను రథంతో పాటు అంజలి రథం, జాలరివల రథం, తెల్ల ఏనుగు రథం, పాలధార రథం కూడా బయలుదేరుతాయి. విగ్రహ రూపంలో చెరువులో ఉన్న పైడిమాంబని బయటకు తీసిన బెస్తవారికి కృతజ్ఞతగా 'బెస్తలవల రథం, రాజ్య పరిరక్షణలో నిరంతరం ఉండే సైనికులను గౌరవిస్తూ...'పాలధార రథం', గజపతుల వంశానికి గుర్తుగా 'తెల్లఏనుగు రథం', పైడిమాంబ సహాయకులకు గుర్తుగా 'అంజలి రథం', ఉంటాయి" అని రథాల తయారీదారు శ్రీనివాస్ చెప్పారు.
ఈ రథాల తయారీలో వాడే రంగులకు కూడా ఒక ప్రత్యేకత ఉంది.
"ఇక్కడ తయారయ్యే రథాలకు పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుని వాడతాం. శుభానికి సూచికంగా చెప్పుకునే పసుపు, మహిళల బొట్టుకు గుర్తుగా ఎరుపు రంగు, రైతుల పండుగకు గుర్తుగా ఆకుపచ్చ రంగుని వాడతాం" అని శ్రీనివాస్ తెలిపారు.
- మంగ్లీ: బోనాల పాటతో అమ్మవారిని అవమానించారా, ఏమిటీ వివాదం?
- BBC Special: పోతురాజు - బోనాల పండుగలో ఈ వేషం ఎవరు వేస్తారు?
వ్యవసాయ పండుగ... కళారూపాల ఉత్సవం...
రైతులు పాడిపంటలు బాగా ఉండాలని కోరుకుంటూ భూమిపూజ చేస్తుంటారు. సాధారణంగా ఉగాది సమయంలో కొన్ని ప్రాంతాల్లో రైతులు నాగళ్లతో తొలేళ్ల ఉత్సవాన్ని చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం పైడితల్లి అమ్మవారి పండుగనే తొలేళ్ల ఉత్సవంగా జరుపుకుంటారు. సిరిమాను సంబరానికి ముందు రోజు తొలేళ్ల ఉత్సవం వైభవంగా జరుగుతుంది.
"సిరిమానును అమ్మవారిగా ఆరాధించే ఉత్సవానికి ముందురోజు తొలేళ్లు నిర్వహిస్తాం. తొలి ఏరే తొలేళ్లుగా మారింది. ఏరు అంటే నాగలి. తొలేళ్ల రాత్రి రైతులకు విత్తనాలు అందజేస్తాం. వాటిని పొలాల్లో జల్లి నాగలితో భూమాతను పూజిస్తే సమృద్ధిగా పంటలు పండుతాయని విశ్వాసం. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. సిరిమానోత్సవంలో ఇదే ప్రధానమైనది" అని పూజారి బంటుపల్లి వెంకటరావు చెప్పారు.
సిరిమాను ఉత్సవాలలో కళారూపాలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. అమ్మవారి వాహనమైన పులివేషాలు విశేషంగా ఆకట్టుకుంటాయని ఏటా ఘటాలు మోసే నాగలక్ష్మి బీబీసీతో చెప్పారు.
"ఘటాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నీళ్లు చల్లడం, కత్తిసాము, కర్రసాములతో పాటు వివిధ కళారూపాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. విచిత్ర వేషధారణలతో కూడా సందడి చేస్తుంటారు. ఇవన్ని కూడా మొక్కులు చెల్లించుకోవడంలో భాగమే " అని నాగలక్ష్మి బీబీసీతో చెప్పారు.
ఉత్సవం తర్వాత సిరిమాను ఏమౌతుంది?
ప్రధాన ఉత్సవం రోజున సుమారు 60 అడుగుల పొడవుండే సిరిమాను చివరన పూజారి కూర్చున్న తర్వాత సిరిమాను పైకి లేస్తుంది. ఈ సిరిమాను మూడు లాంతర్ల జంక్షన్ నుంచి కోట వరకు మూడుసార్లు తిరుగుతుంది.
రాజకుటుంబీకులు, ప్రముఖులు కోట బురుజు వద్ద కూర్చుని అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి రూపంగా భావించే సిరిమానును అధిరోహించిన పూజారి అందరికీ దీవెనలు అందిస్తారు.
ఈ ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్ ఘడ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా వస్తారు.
ఉత్సవం ముగిసిన తర్వాత సిరిమానును చిన్నచిన్న ముక్కలుగా చేస్తారు. దానిని రైతులు తీసుకుని వాటిని ఇంట్లో ఉంచుకుని పూజలు చేస్తారు. కొందరు తమ పొలంలో పూజించే చోట ఉంచుతారు. అలాగే విత్తనాలతో పాటు పొలంలో వీటిని విసురుతారు. ఇదంతా కూడా మంచి పంటలు పండుతాయనే నమ్మకంతో చేస్తారు. సిరిమానోత్సవం పూర్తయిన తర్వాత వచ్చే వరుస మంగళవారాల్లో తెప్పోత్సవం, ఉయ్యాలకంబాల ఉత్సవం జరుగుతుంది. అక్కడితో ఆ ఏడాది అమ్మవారి నెల రోజుల ఉత్సవాలు ముగుస్తాయి.
ఈ ఏడాది కూడా భక్తులకు నో ఎంట్రీ...
సాధారణ పరిస్థితుల్లో ఏటా సిరిమానోత్సవానికి 3 లక్షల మంది వరకు భక్తులు వివిధ ప్రాంతాలనుంచి వస్తారు. అయితే గతేడాది, ఈ ఏడాది కూడా కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా భక్తులకు అనుమతి ఇవ్వలేదు.
సంప్రదాయబద్ధంగా పండగ నిర్వహణకు చర్యలు చేపడుతున్నాం. సిరిమాను, జాలారి, పాలధార, ఐరావతం, అంజలి రథాలను లాగేందుకు ఉన్న వాలంటీర్లకు మాత్రమే అనుమతి ఉంటుందని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు.
"ప్రజలంతా ఉత్సవాన్ని తిలకించేందుకు వీలుగా జంక్షన్లలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాం. తొలేళ్లు, సిరిమానోత్సవం రోజున ప్రజా రవాణ, ఇతర వాహనాలను కూడా అనుమతించడం లేదు. అమ్మవారి సంబరంలో పాల్గొనే సేవా సంస్థల కార్యకర్తలు, వాలంటీర్లకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం" అని సూర్యకుమారి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందా, కరెంటు కోతలు ఇంకా పెరుగుతాయా?
- మంజులా ప్రదీప్: దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- జీ-20 సదస్సులో నరేంద్ర మోదీ: 'అఫ్గానిస్తాన్ను తీవ్రవాదానికి కేంద్రంగా మారనివ్వద్దు'
- వాతావరణ మార్పులు: కాప్-26లో భారత్, చైనా చేతులు కలిపి అమెరికానే ప్రతిఘటిస్తాయా?
- మోదీ తీసుకొస్తున్న 'బలవర్ధక బియ్యం’ ఏంటి? ఈ అన్నం తింటే దేశ ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందా?
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)