బెంగళూరులో దారుణం... ఏపీ యువతిపై నైజీరియన్ల అత్యాచారం... తెర పైకి రెండు వెర్షన్లు...
కర్ణాటకలో ఇటీవల ఎంబీఏ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన మరవకముందే మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది.బెంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్పై ఇద్దరు నైజీరియన్లు అత్యాచారానికి పాల్పడ్డారు.నిందితుల్లో ఒకరు ఆమె స్నేహితుడు కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికైతే రెండు వెర్షన్లు తెర పైకి వచ్చాయి. బాధితురాలు బాన్సవాడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

అతని ఇంట్లో పార్టీ... ఆపై...
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువతి(29) బెంగళూరులోని ఓ కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. కొద్ది రోజుల క్రితం టోనీ అనే నైజీరియన్ వ్యక్తితో ఆమెకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్లో టచ్లో ఉండేవారు. ఇటీవల ఇద్దరు ప్రత్యక్షంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఇదే క్రమంలో మంగళవారం(ఆగస్టు 31) ఆ యువతి కమ్మరహళ్లిలోని టోనీ ఇంటికి వెళ్లింది. అక్కడ ఇద్దరు కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత మద్యం మత్తులోనే శృంగారంలో పాల్గొని నిద్రలోకి జారుకున్నారు.

నిద్ర లేచేసరికి... పక్కనే నగ్నంగా మరో యువకుడు...
ఉదయం నిద్ర లేచేసరికి ఆ యువతి తన పక్కన మరో యువకుడు నగ్నంగా ఉండటం గమనించింది. రాత్రి తాను మద్యం మత్తులో ఉన్న సమయంలో టోనీతో పాటు అతను కూడా తనతో శృంగారం చేసినట్లు గ్రహించింది.అతను టోనీ స్నేహితుడు ఉబాకాగా గుర్తించింది. గతంలోనూ అతను తనకోసారి మెసేజ్ చేసినట్లు గుర్తు తెచ్చుకుంది. తనను కలిసేందుకు అతను ప్రయత్నించగా ఆమె అతన్ని దూరం పెట్టింది. ఉబాకా గురించి టోనీని ఆమె ప్రశ్నించగా.. అతనెవరో తనకు తెలియదని బుకాయించాడు. దీంతో బాన్సవాడి పోలీసులను ఆశ్రయించిన యువతి తనపై ఇద్దరు నైజీరియన్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు.

మరో వెర్షన్ ఇలా :
ఈ అత్యాచార ఘటనకు సంబంధించి మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. దాని ప్రకారం.. ఆ యువతికి ఇద్దరు నైజీరియన్లతో కొంతకాలంగా పరిచయం ఉంది. సోషల్ మీడియా ద్వారా వీరు స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి యువతి వారి ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమె శీతల పానీయం తాగగా.. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆపై ఇద్దరు నైజీరియన్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె గ్రహించింది. మరుసటి రోజు బాన్సవాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇటీవల మైసూరులో గ్యాంగ్ రేప్
కర్ణాటకలోని మైసూరులో 23 ఏళ్ల ఎంబీఏ విద్యార్థినిపై నలుగురైదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడిన ఘటన ఇటీవల సంచలనం రేపిన సంగతి తెలిసిందే.బాధితురాలు ఉత్తరప్రదేశ్కి చెందిన యువతి. ప్రస్తుతం కర్ణాటకలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఆమె ఎంబీఏ చదువుతోంది. మంగళవారం(ఆగస్టు 23) సాయంత్రం తన బాయ్ఫ్రెండ్తో కలిసి ఆమె చాముండి హిల్స్కి వెళ్లింది.అక్కడి నుంచి తిరిగొస్తున్న క్రమంలో... మార్గమధ్యలో లలితాద్రిపురా సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ గ్యాంగ్ వారిని అడ్డగించారు. మొదట వారి నుంచి డబ్బు డిమాండ్ చేశారు. వారి వద్ద పెద్దగా డబ్బు లేదని తెలిసి మొదట దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువతిని సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు.












Click it and Unblock the Notifications