ల్యాంకో టోల్ గేట్లకు నిప్పు: గేట్లు ధ్వంసం
బెంగళూరు: టోల్ గేట్ రుసుం చెల్లించే విషయంలో జరిగిన గొడవ కారణంగా టోల్ గేట్ లు ధ్వంసం చేసి నిప్పంటించిన సంఘటన బెంగళూరు నగర శివార్లలోని హోసకోటే దగ్గర జరిగింది. బెంగళూరు- చెన్నయ్ జాతీయ రహదారిలో ఎర్పాటు చేసిన ల్యాంకో టోల్ గేట్ లు ధ్వంసమయ్యాయి.
ల్యాంకో టోల్ గేట్ సిబ్బంది దాడిలో గాయపడిన గ్రామపంచాయితీ సభ్యుడు నారాయణస్వామి, ఆయన కుమారుడు బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. ఆదివారం నారాయణస్వామి కుటుంబ సభ్యులతో కలిసి స్కార్పియో వాహనంలో బయలుదేరారు.
బూదిగెరె గేట్ సమీపంలోని ల్యాంకో సంస్థ నిర్వహిస్తున్న టోల్ గేట్ దగ్గర వాహనాన్ని నిలిపారు. తాను స్థానికుడు అని, పైగా గ్రామ పంచాయితీ సభ్యుడనని నారాయణస్వామి వారికి చెప్పారు. ఆ సందర్బంలో టోల్ గేట్ సిబ్బంది నారాయణస్వామిని బూతులు తిట్టారనే ఆరోపణలు వచ్చాయి. నారాయణస్వామి, ఆయన కుమారుడు కారులో నుండి కిందకు దిగి ఎందుకు దూషిస్తున్నారని ప్రశ్నించారు.
అదే సమయంలో నారాయణస్వామి, ఆయన కుమారుడి మీద టోల్ గేట్ సిబ్బంది దాడి చేశారు. గాయాలైన నారాయణస్వామి గ్రామస్తులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వంటనే గ్రామస్తులు టోల్ గేట్ దగ్గరకు చేరుకున్నారు. తన నాయకుడి మీద దాడి చేస్తారా అంటు టోల్ గేట్లను ధ్వంసం చేశారు.
మూడు టోల్ గేట్లకు నిప్పంటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లాఠీచార్జ్ చేసి అందరిని చెదరగొట్టారు. ల్యాంకో టోల్ గేట్ ల దగ్గర బలవంతంగా టోల్ ఫీజ్ వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు.