మనసును కలిచివేసేలా!: కజిరంగ పార్కులో వన్య ప్రాణుల విలవిల..
ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో రైనోలు అటు ఇటు పరుగులు పెడుతున్న దృశ్యాలు మనసుల్ని కలిచివేస్తున్నాయి.
గువాహటి: అసోంలో భారీ వర్షాల ధాటికి కజిరంగ జాతీయ పార్కులోని వన్య ప్రాణులు అల్లాడుతున్నాయి. భారీ వర్షాలు పార్కును ముంచెత్తడంతో వన్యప్రాణులు వరద నీటిలో చిక్కుకుపోయాయి. పార్కు మధ్యలో అక్కడక్కడ ఉన్న ఎత్తు ప్రదేశాల వద్ద జంతువులు ఆశ్రయం పొందుతున్నాయి.
గత కొద్దిరోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో సుమారు 6 హాగ్ డీర్ జంతువులు మృత్యువాత పడ్డాయి. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో రైనోలు కూడా సతమవతమవుతున్నాయి. చుట్టూ ఎటూ చూసిన వరద నీరే నిలిచిపోవడంతో.. ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో రైనోలు అటు ఇటు పరుగులు పెడుతున్న దృశ్యాలు మనసుల్ని కలిచివేస్తున్నాయి.
మరోవైపు జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరద నీటి ఉధృతి రీత్యా ఏనుగులు, రైనోలు, డీర్లను ఇప్పటికే కర్బీ కొండ ప్రాంతాలకు తరలించారు. వేటగాళ్ల బెడద కూడా ఉండటంతో.. అటవీ అధికారులు రాత్రిపూట పార్కులో పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు.