మళ్లీ: నల్లధనంపై మోడీకి అన్నా హజారే హెచ్చరిక, లేఖ
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న నల్లధనానికి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించలేమంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పడాన్ని బ్లాక్ మనీ పైన గతంలో ఉద్యమించిన అన్నా హజారే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అంతేకాదు విదేశాల్లోని భారతీయులు అక్రమంగా దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి దీసుకురాని పక్షంలో మరోసారి ఆందోళన చేపడతానని హెచ్చరించారు.
నల్లధనాన్ని వెనక్కి తీసుక రావడం దేశం ముందున్న ఒక ప్రధాన సమస్య అని, అవసరమైతే ఈ విషయంపై మరోసారి ఆందోళన చేయడానికి నేను వెనుకాడబోనని అన్నా హజారే ఆ లేఖలో స్పష్టం చేశారు.

తాము అధికారంలోకి వస్తే విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకు వస్తామని లోకసభ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్ ద్వంద్వ పన్నుల నిరోధక ఒప్పందం చేసుకున్న దేశాలనుంచి నల్లధనానికి సంబంధించి అందిన వివరాలను వెల్లడించబోమంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గత 35 ఏళ్లలో నేను ఎన్నో ఆందోళనను చేశానని, అవన్నీ ఏ పార్టీకి లేదా వ్యక్తికి వ్యతిరేకంగా చేసినవి కావని, సమాజం, దేశం హింతం కోసం చేసినవేనని హజారే తన లేఖలో పేర్కొన్నారు.
మీకు పదవిలో ఉన్న అనుభవం ఎంతో ఉందని ఆయన మోడీని ఉద్దేశించి పేర్కొంటూ.. తాను ఒక ఫకీర్నని, తన దగ్గర ఎలాంటి సంపదా లేదని, దేశం కోసమే జీవిస్తున్నానని, దానికోసమే ప్రాణాలు అర్పిస్తానని పేర్కొన్నారు. లోక్పాల్ అంశంపై తాను గత ఆగస్టులో మోడీకి ఒక లేఖ రాసనని, అయితే దానికి ఇప్పటిదాకా ఎలాంటి సమాధానం రాలేదని కూడా అన్నా హజారే ఆ లేఖలో రాశారు.












Click it and Unblock the Notifications