ఫోటో: జయ కోసం ఫన్నీ బ్యానర్, జైల్లో బోరున ఏడ్చారు
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత విడుదల కోసం ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. జయలలితను విడుదల చేయకుంటే.. అంటూ హెచ్చరికల బోర్డులు కూడా వెలిశాయి. తాజాగా ఓ ఫన్నీగా ఉండే భారీ ఫ్లెక్సీ చెన్నైలో వెలిసింది.
కావేరీ నీటిని తీసుకొని, జయలలితను తిప్పి పంపాలని ఆ ఫ్లెక్సీలో రాశారు. దీని పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కర్నాటక, తమిళనాడు మధ్య కావేరి జలాల గొడవ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు జయలలిత కర్నాటక రాజధాని బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.

దీంతో కావేరీ నీటిని తీసుకొని, జయను విడుదల చేయాలని అందులో రాయడం గమనార్హం. జయలలిత జైలులో ఉండటం, ఆమెకు మంగళవారం బెయిల్ రానందున అభిమానులు, కార్యకర్తలు రొమ్ము గుద్దుకొని మరీ ఏడ్చిన సంఘటనలు కనిపించాయి. అదే విధంగా ఈ ఫ్లెక్సీలో ఓ చిన్నారి జయ విడుదల కోసం ఏడుస్తున్నట్లుగా ఉంది. ఈ ఫ్లెక్సీ పైన స్థానిక అన్నాడీఎంకే నాయకుల పేర్లు ఉన్నయి.
సుప్రీం కోర్టులోనే...
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష పడి జైల్లో ఉన్న జయలలితకు కర్నాటక హైకోర్టు బెయిల్ నిరాకరంచడంతో సుప్రీం కోర్టులో తేల్చుకుంటామని జయ తరఫు న్యాయవాదులు ప్రకటించారు. ఈ మేరకు సుప్రీంలో పిటిషన్ వేసేందుకు లాయర్లు సిద్ధమవుతున్నారు. జయలలిత, ఆమె ముగ్గురు అనుచరుల బెయిల్ పిటిషన్లను కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్ తిరస్కరించారు. అవినీతిని మానవ హక్కుల ఉల్లంఘనగానే పరిగణించాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
జయ తరఫున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ దాదాపు మూడు గంటలకు పైగా వాదనలు వినిపించడంతోపాటు జయకు బెయిలిస్తే తమకేమీ అభ్యంతరం లేదని కర్ణాటక ప్రభుత్వం చెప్పినా బెయిల్ రాలేదు. టీవీ ద్వారా సమాచారం తెలుసుకుంటున్న జయలలిత కుప్పకూలిపోయారు. ఒక సందర్భంలో ఆమె కంటతడి పెట్టారని, మరోవైపు శశికళ, ఇళవరసిలు భోరున విలపించారని తెలిసింది. జయ కుప్పకూలటంతో జైలు అధికారులు తక్షణం వైద్య బృందాన్ని రప్పించారు.












Click it and Unblock the Notifications