హత్రాస్లో మరో దారుణం... 16 ఏళ్ల దళిత యువతిపై గ్యాంగ్ రేప్... బాధితురాలినే బెదిరించిన పోలీసులు...
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో మరో దారుణం వెలుగుచూసింది. 16 ఏళ్ల దళిత బాలికపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. హోలీ రోజున బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... పోలీసులు తననే బెదిరింపులకు గురిచేశారని బాధితురాలు వాపోయారు. నిందితులపై ఫిర్యాదు చేస్తే నిన్నూ,నీ తండ్రిని అరెస్ట్ చేస్తామని పోలీసులు బెదిరించినట్లు చెప్పారు.యూపీలో మహిళలపై నిత్యం వెలుగుచూస్తున్న నేరాలను గమనిస్తే అసలక్కడ మహిళలకు భద్రత ఉందా అన్న అనుమానాలు తలెత్తకమానదు.
Recommended Video
అసలేం జరిగింది...
ఈ ఏడాది మార్చి 29,హోలీ రోజున హత్రాస్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక మధ్యాహ్నం 2గంటల సమయంలో బహిర్భూమి కోసం బయటకు వెళ్లింది. అదే సమయంలో ఓ వ్యక్తి ఆమె వెనకాలే వెళ్లి... మత్తు మందు చల్లిన గుడ్డ ముక్కతో ఆమె ముక్కు,నోరు మూశాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తనకు మళ్లీ మెలుకువ వచ్చి చూసేసరికి నిందితుడి సోదరి ఇంట్లో ఉన్నట్లు ఆమె గుర్తించింది. ఆ రాత్రి అదే ఇంట్లో బాలికపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు.బాలిక గట్టిగా కేకలు పెట్టడంతో ఆమె నోట్లో గుడ్డలు కుక్కారు.
పోలీసులు బాధితురాలినే బెదిరించారు...
ఆ మరుసటిరోజు బాలికను తిరిగి ఆమె గ్రామంలో వదిలిపెట్టి నిందితులు పారిపోయారు. జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పగా... కుమార్తెను వెంటపెట్టుకుని వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే కేసు నమోదు చేయాల్సిన పోలీసులు.. రివర్స్లో తమనే బెదిరించారని బాధిత బాలిక వాపోయింది. నిందితులపై ఫిర్యాదు చేస్తే నిన్నూ,నీ తండ్రిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తనను బెదిరించినట్లుగా చెప్పింది. స్థానిక పోలీసుల తీరుతో షాక్ తిన్న బాధిత కుటుంబం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ వినీయ్ జైస్వాల్ చొరవతో నిందితులపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
గతేడాది ఇదే హత్రాస్లో...
గతేడాది ఇదే హత్రాస్లో దళిత(బోయ) యువతిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ల యువతిపై అగ్రకులానికి చెందిన నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పొలంలో పనిచేసుకుంటున్న ఆమెను ఆమె చున్నీనే గొంతుకు బిగించి లాక్కెళ్లారు.. చిత్రహింసలకు గురి చేశారు. . నాలుక కోశారు.. వారి పైశాచికత్వానికి ఆమె వెన్నెముక కూడా విరిగిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందగా... స్థానిక పోలీసులు రాత్రికి రాత్రే ఆమె దహన సంస్కారాలు నిర్వహించారు. కేసులో ఆధారాలు మాయం చేసేందుకే ఇలా చేశారని పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది.