పంజాబ్ లో ఆగని గ్యాస్ లీకులు- విషవాయువులు పీల్చి టీచర్లు, విద్యార్ధుల ఉక్కిరిబిక్కిరి..
పంజాబ్ లో గ్యాస్ లీక్ ఘటనలు ఆగడం లేదు. ఇప్పటికే గత వారం లూథియానాలో గ్యాస్ లీక్ ఘటనలో 11 మంది మృత్యువాత పడగా.. ఇవాళ దాదాపు అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న నంగల్ నగరంలో ఈ గ్యాస్ లీక్ ఘటన చోటు చేసుకుంది. స్ధానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ కావడంతో పక్కనే ఉన్న స్కూల్లో విద్యార్ధులు, టీచర్లు ఆస్పత్రి పాలయ్యారు.
లూథియానా గ్యాస్ లీక్ ఘటన తర్వాత నంగల్ లోని ఓ ప్రైవేట్ పాఠశాల సమీపంలోని పరిశ్రమ నుండి గ్యాస్ లీక్ కావడంతో చాలా మంది పిల్లలు, ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరయ్యారు. స్ధానికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక ప్రైవేట్ పాఠశాల సమీపంలోని పరిశ్రమ నుండి గ్యాస్ లీక్ అయ్యిందని గుర్తించారు. ఆ తర్వాత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో హుటాహుటిన పిల్లలు, ఉపాధ్యాయులను నంగల్లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే డిప్యూటీ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

పంజాబ్, హిమాచల్ సరిహద్దుల్లోని నంగల్ నగరంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి గురువారం గ్యాస్ లీకైనట్లు గుర్తించారు. ఈ ఘటనతో చిన్న పిల్లలు, కొందరికి గొంతునొప్పి, తలనొప్పి వచ్చిందని నిర్ధారించారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమీపంలోని పాఠశాలకు చెందిన 7 మంది పిల్లలు కూడా గ్యాస్ పీల్చి అస్వస్ధతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే స్ధానిక అధికార యంత్రాంగం మొత్తం ప్రాంతాన్ని సీల్ చేసింది. ముందుజాగ్రత్త చర్యగా పాఠశాల విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
నంగల్ గ్యాస్ లీక్ ఘటన నేపథ్యంలో పోలీసులు, ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. ఇతర విభాగాలు, ఆరోగ్య శాఖ నుండి బృందాలను కూడా పిలిపించారు. గ్యాస్ లీక్ అయిన ప్రదేశంలో నిత్యం 300 నుంచి 400 మంది ఉంటారని గుర్తించారు. నంగల్లో మొదటి PACL మరియు రెండవ NFLలో రెండు పెద్ద కర్మాగారాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్యాస్ ఎక్కడి నుంచి లీక్ అయిందనేది నిర్ధారణ కాలేదు.












Click it and Unblock the Notifications