తోపుడుబండిపైనే భార్య శవంతో 8 కి.మీ నడక, ఎందుకంటే?
లక్నో:ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో మరో విషాదకర ఘటన వెలుగు చూసింది అంబులెన్స్ సిబ్బంది ఆలస్యం కారణంగా నిండు ప్రాణం పోయింది. మరో వైపు వైద్యుల కర్కశత్వం కారణంగా భార్య శవాన్ని కిలోమీటర్త దూరం తోపుడు బండిలో తోసుకొంటూ తీసుకెళ్ళిన ఘటన యూపీ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని మెయిన్పురి జిల్లాకు చెందిన 36 ఏళ్ల కన్హయ్యలాల్ తన భార్య సోనీ అస్వస్థతకు లోనవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి మంగళవారం నాడు అంబులెన్స్కు ఫోన్ చేశాడు.
గంటలు గడిచిన అంబులెన్స్ రాకపోవడంతో భార్యను తోపుడు బండిపై తోసుకుంటూ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మెయిన్పురి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు మార్గం మధ్యలోనే చనిపోయిందని చెప్పడంతో ఒక్క సారిగా కప్పకూలాడు.
తన భార్య శవాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ను ఏర్పాటు చేయాలని కోరినప్పటికి ఆస్పత్రి వర్గాలు ఒప్పుకోలేదు.దినసరి కూలీగా పనిచేస్తున్న అతను చేసేదేమీ లేక భార్య శవాన్ని గుడ్డలతో చుట్టి తోపుడు బండిపై తోసుకుంటూ వెళ్లాడు.
ఈ దృశాన్ని చూసిన అక్కడి ప్రజలు చలించిపోయారు. ఆసుపత్రిలో వైద్యుల తీరును తప్పుబట్టారు. ఈ ఘటనపై యూపీ వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ త్రివేది స్పందించారు. 108 అంబులెన్స్ నెంబర్కు ఎలాంటి ఫోన్ రాలేదని చెప్పారు.
కన్హయ్య చాలా పేదవాడు అతని దగ్గర ఫోన్ చేసేందుకు మొబైల్ కూడా లేదన్నారు. ఒకవేళ ఫోన్ చేసినా ఆస్పత్రికో లేదా వేరొక నెంబర్కో ఫోన్ చేసి ఉంటారని తెలిపారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.