అనూహ్య కేసు: బైక్పై ఎలా వెళ్తుందని తండ్రి అనుమానం
ముంబై/విజయవాడ: కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సాఫ్టువేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో సిట్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనూహ్య తండ్రి మాత్రం కట్టుకథలా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనూహ్య ఒక అపరిచితుని వాహనంపై వెళ్లిందని పోలీసులు తేల్చడం నమ్మశక్యంగా లేదని తండ్రి ప్రసాద్ అంటున్నారు.
ముంబై పోలీసుల కథనం కట్టుకథలా ఉందన్నారు. అనూహ్య హత్యకు సంబంధించి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం, ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏదో ఒక రకంగా కేసును మూసేసి, చేతులు దులుపుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆరోపించారు. అనూహ్యతో పాటు సిసిటివి పుటేజిలో కనిపించిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసినట్టు పోలీసులు చెబుతున్నా, నమ్మశక్యంగా లేదన్నారు.
సిసిటివి పుటేజిలో కనిపించిన వ్యక్తికి 40 ఏళ్లకు పైగా వయసు ఉంటుందని తొలుత పేర్కొన్న పోలీసులు ఇప్పుడు 28 ఏళ్లని చెబుతున్నారన్నారు. తన కూతురు ముక్కూముహం తెలియని వ్యక్తితో, బైక్పై వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారని, అనూహ్య బ్యాగ్, దుస్తులు, ల్యాప్టాప్ తదితర వస్తువులను సేకరించలేక పోయారన్నారు.
వస్తువులను యాచకులకు దానం చేశారనడం కూడా నమ్మశక్యంగా లేదని, నిందితుడితో ఒక్కమాట కూడా మాట్లాడించకుండా కట్టుకథ అల్లి మీడియాకు చెప్పినట్లుగా ఉందన్నారు. నిజమైన నిందితులను అరెస్టు చేయాలన్నారు. బ్యాగులో సామాను లేదని చెబుతున్నారని అన్నారు. పూర్తి ఆధారాలు లేవని ఆయన అభిప్రాయపడుతున్నారు.