మోడీకి మద్దతుగా ర్యాలీ, కమల్ హాసన్ సంతకం
ఢిల్లీ: అసహనం పోకడలు పెరిగిపోతున్నాయని రచయితలు, కళాకారులు, మేథోవర్గాల నుంచి వ్యక్తమవుతున్న నిరసనలకు వ్యతిరేకంగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సారథ్యంలో శనివారం 'మార్చ్ ఫర్ ఇండియా' ప్రదర్శన నిర్వహించారు.
పురస్కారాలను తిరిగి ఇచ్చేస్తున్న వైనాన్ని దేశాన్ని అప్రతిష్ట పాలుచేసే చర్యగా వారు పేర్కొన్నారు. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు బాలీవుడ్ ప్రముఖులు, రచయితలు, కళాకారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీలను వారు కలుసుకున్నారు. రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించారు. ఈ ప్రదర్శనలో బాలీవుడ్ ప్రముఖులు మధుర్ భండార్కర్, అశోక్ పండిట్, ప్రియదర్శన్, మనోజ్ జో,ి, అభఇజిత్ భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు.
అనంతరం రాష్ట్రపతికి సమర్పించిన విజ్ఞాపన పత్రంలో నటుడు కమల్ హాసన్, విద్యాబాలన్, శేఖర్ కపూర్, వివేక్ ఒబెరాయ్, రవీనా టాండన్ తదితరులు సంతకాలు పెట్టారు.
అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ... భారత దేశం పరమత సహనానికి పెట్టింది పేరు అని, అసహనం పెరిగిపోతోందని కొందరు కంగారు పడుతున్నారని, అలాంటి వారు కొద్దిమందే ఉన్నారని, ప్రతి భారతీయుడు అసహనం పెరిగిపోతుందని అనుకోవడం లేదన్నారు. మనమంతా లౌకికవాదులం అన్నారు.