Weather:ఏపీ, తెలంగాణలో మరో మూడురోజులపాటు వానలు, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్/అమరావతి: కాస్త ఎడతెరిపినిచ్చినట్లు కనిపించిన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మొదలయ్యాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆదివారం వానలు కురిశాయి. కాగా, రానున్న మూడు రోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులపాటు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణితో పాటు బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.

తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షాలు
తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు తెలిపారు. . భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కొమ్రంభీం అసిఫాబాద్, పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్, జనగామ, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మంగళవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిస్తాయని చెప్పారు అధికారులు.

ఏపీలోనూ మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. విశాఖ జిల్లాలో ఆదివారం పలు చోట్ల వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆదిఇలావుంటే, రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు శనివారం ఏర్పడిన 'ఉపరితల ద్రోణి' ప్రస్తుతం సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

కోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఇక, సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. మంగళవారం ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక, దక్షిణ కోస్తాంధ్రాలో సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. మంగళవారం దక్షిణ కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సోమవారం రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. మంగళవారం రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే కురిసిన వర్షాలు గ్రామాలు, పట్టణాల్లోని రోడ్లను భారీగా దెబ్బతీశాయి. మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు, వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.












Click it and Unblock the Notifications