జీపీఎఫ్ నుంచి ఏపీ సర్కార్ నిధులు విత్ డ్రా చేసింది: కేంద్రం
ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్ అవసరాల కోసం జీపీఎఫ్లో దాచుకున్న సొమ్ములకు కస్టోడియన్ గా ఉన్న ప్రభుత్వమే, ఉద్యోగులకు తెలియకుడా వారి ఖాతాల నుంచి విత్ డ్రా చేసింది. ఈ అంశం ఏపీలో దుమారం రేపింది. దీనిపై విపక్షాలు ఓ రేంజ్లో ఫైరయ్యాయి. ప్రభుత్వం కూడా సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ పై లోక్ సభలో కేంద్రం వివరణ ఇచ్చింది.
ఉద్యోగుల జీపీఎఫ్ నుంచి ఏపీ ప్రభుత్వం నిధులు విత్ డ్రా చేసిందని వెల్లడించింది. 2021-22లో రూ.413.73 కోట్లు విత్ డ్రా చేసినట్టు కేంద్ర ఆర్థికశాఖ వివరించింది. ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ముపై టీడీపీ ఎంపీ కేశినేని నాని లోక్ సభలో ప్రశ్నించారు. నాని అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఉద్యోగుల జీపీఎఫ్ నిధుల ఉపసంహరణ అంశం ఏపీ హైకోర్టులో విచారణకు రావడం తెలిసిందే. సాంకేతిక కారణాల వల్లే ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ము విత్ డ్రా చేయడం జరిగిందని ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ ఆనాడు వాదనలు వినిపించారు. బడ్జెట్ మంజూరు అయితే, ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ము తిరిగి జమ చేస్తామని అన్నారు. ఇంకా పలు కారణాలు వివరించేందుకు ప్రయత్నించగా, హైకోర్టు స్పందించింది. ప్రభుత్వం చెప్పే వివరాలు కాగ్కు కూడా అర్థం కావని పేర్కొంది.
ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ నిధులను కార్పస్ ఫండ్గా వివిధ ప్రభుత్వ పథకాలకు మళ్లిస్తున్నారని ఇదివరకే ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి గతేడాది మినహాయించిన 50 శాతం జీతం, పెన్షన్ బకాయిలను ఇంతవరకు చెల్లించకపోవడం మంచిది కాదన్నారు. ఇంతలోనే కేంద్రం సమాధానం చెప్పింది. దీంతో విపక్షాలు ఒంటి కాలిపై లేచే అవకాశం ఉంది.