ఎన్డీఏ నుంచి ఔట్: అకాలీదళ్కు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ మద్దతు: సుఖ్బీర్ అభినందనలు
న్యూడిల్లీ: ఎన్డీఏ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన శిరోమణి అకాలీదళ్కు మద్దతిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. టీఎంసీ కూడా ఎన్డీఏలో ఒకప్పటి భాగస్వామి కావడం గమనార్హం. కాగా, వ్యవసాయ బిల్లులు రాజ్యసభలో ప్రవేశపెట్టిన సమయంలో డెరెక్ ఓబ్రెయిన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి సభ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.
సుఖ్బీర్ సింగ్ వెంట మేమూ: డెరెక్
నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్(ఎన్డీఏ) నుంచి తమ పార్టీ వైదొలగిందని శనివారం శిరోమణి అకాలీదళ్ పార్టీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అకాలీదళ్ నిర్ణయానికి తాము మద్దతిస్తున్నట్లు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ అన్నారు. రైతులకు మద్దతుగా నిలబడిన సుఖ్బీర్ సింగ్ బాదల్ వెంట తాము ఉంటామన్నారు. రైతుల కోసం పోరాటం చేయడమనేది టీఎంసీ డీఎన్ఏలోనే ఉందని డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. రైతుల హక్కుల కోసం 2006లో మమతా బెనర్జీ సుమారు 26 రోజులపాటు నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. తాము కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నామని ట్వీట్టర్ వేదికగా డెరెక్ ఓబ్రెయిన్ వెల్లడించారు.
డెరెక్ను అభినందిస్తూ సుఖ్బీర్ సింగ్..
డెరెక్ ట్వీట్పై శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ స్పందించారు. పార్లమెంటులో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా మీరు నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. మీ మద్దతును అభినందిస్తున్నట్లు డెరెక్ ఓబ్రెయిన్ ట్వీట్కు సుఖ్బీర్ సింగ్ బాదల్ బదులిచ్చారు.
అనుచిత ప్రవర్తనకు డెరెక్పై వేటు
వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టిన సమయంలో డెరెక్ ఓబ్రెయిన్ అనుచితంగా ప్రవర్తించారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ వద్దకు వెళ్లి పత్రాలను చించేశారు. అంతేగాక, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ మైక్ను విరగ్గొట్టేందుకు ప్రయత్నించారు. ఇతర పార్టీల ఎంపీలు కూడా ఆందోళనలు చేశాయి. అనుచితంగా ప్రవర్తించిన 8 మందిపై పార్లమెంటు వేటు వేసింది. దీంతో పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు.
ఎన్డీఏ నుంచి మూడు పార్టీలు ఔట్..
కాగా, ఎన్డీఏలో దశాబ్దాలుగా భాగస్వామి పార్టీగా ఉంటున్న అకాలీదళ్.. తాజాగా బయటికి వచ్చినట్లు ప్రకటించింది. అప్పటికే అకాలీదళ్ నేత హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసింది. ఇంతకుముందు శివసేన పార్టీ కూడా ఎన్డీఏ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. కాగా, అంతకుముందు ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటికి వెళ్లిన విషయం తెలిసిందే.