రుతుస్రావం మహిళల స్వచ్ఛతను కొలిచే సాధనమా?
తిరువనంతపురం: రుతుస్రావానికి.. పవిత్రతకూ ఉన్న సంబంధం ఏమిటి? మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశాన్ని నిషేధించడంపై సుప్రీంకోర్టు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డును సూటిగా ప్రశ్నించిన ప్రశ్న ఇది.
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై యంగ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వేసిన పిల్పై సోమవారం జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ కురియన్ జోసెఫ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ట్రావెంకోర్ దేవస్వం బోర్డు తరఫున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదించారు.
శబరిమల ఆలయ ప్రవేశానికి సంబంధించి లింగ వివక్ష ఎంత మాత్రం లేదని, రుతస్రావ దశలో ఉన్న మహిళల నిషేధం వెనుక సహేతుకమైన కారణం ఉందని అందుకే వారికి ప్రవేశాన్ని నిషేధించారని చెప్పారు. 41 రోజులపాటు సాగే అయ్యప్ప దీక్షలో పాల్గొనడం రుతుస్రావ దశలో ఉన్న మహిళలకు సాధ్యం కాదని, రుతుస్రావం కారణంగా వారు పవిత్రతను కొనసాగించలేరని ధర్మాసనానికి వివరించారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం 'మహిళల స్వచ్ఛతను రుతుస్రావం ఆధారంగా కొలుస్తున్నారా? అయితే పురుషుల స్వచ్ఛతను ఏ విధంగా కొలుస్తారు' అని ప్రశ్నించింది. దీంతో పాటు ''మహిళల పవిత్రతకు, రుతుస్రావానికీ సంబంధం ఉందని మీరు చెబుతున్నారా? పవిత్రత ఆధారంగా భేదభావం చూపుతారా?'' అని ప్రశ్నించింది.
కాగా వేణుగోపాల్ తన వాదనను మరోసారి వినిపిస్తూ.. మహిళలు, పురుషులూ ఇద్దరికీ ఆలయ ప్రవేశ అర్హత ఉంది కాబట్టి లింగ వివక్ష సమస్య లేదని, శతాబ్దాల నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారమే నిర్ణీత వయసుగల మహిళలను మాత్రం ఆలయంలోనికి రానివ్వట్లేదని చెప్పారు.
ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఎనిమిది దాకా అయ్యప్ప ఆలయాలు ఉన్నాయని.. వాటన్నిటిలోకీ మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తున్నారని గుర్తుచేశారు. శబరిమల ఆలయంలోకి సైతం మహిళలకు ప్రవేశం కల్పిస్తున్నారని... భక్తులు పవిత్రంగా భావించే 18 మెట్లను మాత్రమే ఎక్కనివ్వట్లేదని వివరించారు.
ఎవరైతే 41 రోజుల పాటు పవిత్ర అయ్యప్ప దీక్ష చేపడతారో వారు మాత్రమే 18 మెట్లు ఎక్కేందుకు అర్హులని, అలా దీక్ష చేపట్టని వారు ఆ మెట్లు ఎక్కకూడదని వివరించారు. దీనికి అనుకూలంగా ఇప్పటికే హైకోర్టు తీర్పు కొనసాగింపులో ఉందని పిల్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు దీన్ని పునఃపరిశీలించజాలదని వాదించారు.
దీంతో విచారణలో భాగంగా వాదనలు విన్న సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం కేసు తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు కేరళ సీఎం చాందీ ఈ వ్యవహారంపై గతంలో మాట్లాడుతూ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు.
SC to Sabrimala:Are you associating menstruation with purity of a woman?Can biological phenomenon be condition precedent for discrimination?
— ANI (@ANI_news) 25 April 2016
SC to Sabrimala temple board: Whatever tests of austere practice you apply for men, apply for women too..?
— ANI (@ANI_news) 25 April 2016