సియాచిన్లో ఆర్మీ చీఫ్: మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో.. జవాన్లకు ఆత్మీయ పలకరింపు..!
న్యూఢిల్లీ: సియాచిన్ గ్లేసియర్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం. భారత్కు అత్యంత వ్యూహాత్మక ప్రదేశం కూడా. పాకిస్తాన్, చైనా సరిహద్దుల మధ్య త్రికోణంలో ఉండే ఈ ప్రాంతంలో ప్రస్తుతం నమోదవుతోన్న ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీలు. ఎముకలు కొరికే చలిలో కూడా కంటిపై రెప్ప వాల్చకుండా విధులను నిర్వర్తిస్తోన్న సరిహద్దు భద్రతా జవాన్లను పలకరించారు సైనికాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరావణే. ప్రస్తుతం ఆయన సియాచిన్లో ఉన్నారు. ఆర్మీ చీఫ్గా బాధ్యతలను స్వీకరించిన తరువాత సియాచిన్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి.
నరావణే నార్తరన్ ఆర్మీ కమాండ్ ఏరియాలో రెండు రోజుల పర్యటన గురువారం ఆరంభమైంది. ఇందులో భాగంగా- ఆయన తొలుత సియాచిన్ను సందర్శించారు. న్యూఢిల్లీ నుంచి సైనిక విమానంలో లడక్కు చేరుకున్న అనంతరం ఆయన ప్రత్యేక వాహనంలో సియాచిన్కు బయలుదేరి వెళ్లారు. మంచుకొండల మధ్య సుమారు మూడు గంటల పాటు ప్రయాణంచిన తరువాత సియాచిన్కు చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట నార్తరన్ కమాండర్ లెప్టినెంట్ జనరల్ రణ్బీర్ సింగ్ ఉన్నారు.
జవాన్ల నుంచి గౌరవ వందనాన్ని అందుకున్నారు. నిజానికి ఆర్మీ చీఫ్ స్థాయి అధికారి సియాచిన్లో పర్యటించడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. సరిహద్దుల్లో అత్యంత క్లిష్టమైన వాతావరణంలో విధులను నిర్వర్తిస్తోన్న జవాన్లలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికే తాను ఈ పర్యటనకు వచ్చినట్లు నరావణే తెలిపారు. సాధారణంగా- జనవరి మొదటి వారంలో సియాచిన్ వాతావరణం మరింత సంక్లిష్టంగా ఉంటుందని, అయినప్పటికీ.. అలాంటి సమయాన్నే తాను ఎంచుకున్నానని అన్నారు.