నేపాల్కు ఇండియన్ ఆర్మీ చీఫ్ నరవణే... 'సరిహద్దు' వివాదంపై లెక్క సరిచేస్తారా...?
తూర్పు లదాఖ్లో చైనా భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న సమయంలోనే... నేపాల్ కూడా భారత్ పట్ల కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. బిహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో చేపట్టిన బ్రిడ్జి పనులను అడ్డుకోవడం మొదలు... భారత భూభాగాలను తమవిగా పేర్కొంటూ కొత్త మ్యాప్ను విడుదల చేయడం వరకూ నేపాల్ తన దుందుడుకు వైఖరిని బయటపెట్టుకుంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం సందర్భంగా... అసలైన రామ జన్మ స్థలం నేపాల్లోనే ఉందంటూ మరోసారి భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. చైనా అండతోనే నేపాల్ ఇలా రెచ్చిపోతోందని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేపాల్తో సమస్యల పరిష్కారానికి భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే రంగంలోకి దిగనున్నారు.

ఖాట్మండుకు నరవణే...
వచ్చే నెలలో భారత ఆర్మీ చీఫ్ నరవణే నేపాల్ రాజధాని ఖాట్మండులో పర్యటించనున్నారు. అయితే పర్యటన తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. నరవణే పర్యటనకు నేపాల్ ప్రభుత్వం కూడా ఇప్పటికే అనుమతించినట్లు ఖాట్మండు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీనే నరవణే ఖాట్మండు పర్యటనకు నేపాల్ అనుమతించిందని.. అయితే ఇరు దేశాల్లో కరోనా లాక్ డౌన్ కారణంగా పర్యటన వాయిదా పడిందని పేర్కొన్నాయి.

ఖరారు కాని తేదీలు...
నేపాల్ ఆర్మీ ప్రతినిధి,బ్రిగేడియర్ జనరల్ సంతోష్ పౌడెల్ మాట్లాడుతూ... నరవణే పర్యటనకు సంబంధించిన తేదీలను ఖరారు చేసేందుకు ఇరు వర్గాలు టచ్లో ఉన్నట్లు తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవి భండారి నరవణేకి నేపాల్ ఆర్మీ గౌరవ జనరల్ హోదాను ప్రధానం చేస్తారని చెప్పారు. ఇరు దేశాల సైన్యం మధ్య 1950ల నుంచి 70 ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తామన్నారు.

వివాదం తర్వాత ఇదే తొలిసారి...
నేపాల్తో సరిహద్దు వివాదం తర్వాత భారత్కు చెందిన ఓ ఉన్నతాధికారి నేపాల్లో పర్యటించబోతుండటం ఇదే తొలిసారి. భారత భూభాగంలోని లిపులేఖ్, లిపియాధురా, కాలాపానీలను తమ భూభాగంగా పేర్కొంటూ నేపాల్ కొత్త మ్యాప్ను రూపొందించడం... దాన్ని ఆ దేశ పార్లమెంటులోనూ ఆమోదించుకున్న నేపథ్యంలో నరవణే పర్యటనలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. నేపాల్ అడ్డగోలు వాదనను ఆర్మీ చీఫ్ నరవణే గతంలోనే ఖండించారు. చైనా ప్రోద్బలంతోనే నేపాల్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను నేపాల్ తిప్పికొట్టింది. ఇది తమ చరిత్రను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నరవణే నేపాల్ పర్యటన తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications