శ్రీనగర్లో ఎదురుకాల్పులు.. ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
శ్రీనగర్: పాకిస్తాన్ మిలిటెంట్ల దాడిని భారత సైన్యం భగ్నం చేసింది. ఇరు వర్గాలకు చెందిన ఎదురు కాల్పుల్లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మరణించాడు. శ్రీనగర్లో కరణ్ నగర్ ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపుపై సోమవారం ఇద్దరు పాకిస్తాన్ మిలిటెంట్లు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో ఇద్దరు మిలిటెంట్లు భారీగా ఆయుధాలతో సరిహద్దులు దాటి క్యాంప్లోకి ప్రవేశించడాన్ని అక్కడున్న సెంట్రీ గమనించి వారిపై కాల్పులు జరిపాడు. ఈ అలికిడికి భద్రతా బలగాలు అప్రమత్తం కావడంతో ఆ ఇద్దరు మిలిటెంట్లు అక్కడ్నించి పరారయ్యారు.
వారిని వెతుక్కుంటూ భద్రతా బలగాలు వెళ్లగా, సమీపంలోని ఓ ఇంట్లోంచి ఆ ఇద్దరు మిలిటెంట్లు సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతాబలగాలు కూడా ఎదురుకాల్పులకు దిగాయి. ఈలోగా ఘటనా స్థలానికి మరిని బలగాలు కూడా చేరుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక భారతీయ జవాన్ తీవ్రంగా గాయపడి మరణించినట్లు అధికారులు తెలిపారు.