ఎన్కౌంటర్: కాశ్మీర్లో ఏపీ జవాను మృతి, పెళ్లి చేద్దామనుకున్న తల్లిదండ్రలకు తీరని వేదన
శ్రీనగర్/శ్రీకాకుళం: జమ్మూకాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ జవాను మృతిచెందాడు. వీరమరణం పొందిన జవానును శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాద గుణకరరావు(25)గా గుర్తించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన గుణకరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని అధికారులు వెల్లడించారు.
బుధవారం ఉదయం లష్కరే తోయిబా ఉగ్రవాదులు కుంద్వాని ప్రాంతంలో దాక్కున్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. బుధవారం ఉదయం నుంచి ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు నక్కిన ఇల్లు జీలం నది ఒడ్డున ఉండగా, సమయంలో స్థానికులు నదికి మరో పక్కన గుమిగూడారు.
ఆ ప్రాంతం కాల్పుల పరిధిలోనే ఉందని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో కాల్పుల్లో చిక్కుకుని బుల్లెట్ల గాయాలతో నలుగురు పౌరులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. పలువురు పౌరులను జీపులో తీసుకెళ్తుండగా, ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో జీపు నడుపుతున్న గుణకర రావుకు బుల్లెట్లు తగిలాయి. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందారు.
కాగా, ప్రజలను వెళ్లగొట్టేందుకు పోలీసులు కొంతసేపు తమ ఆపరేషన్ను నిలిపేశారు. ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు ఆ సమయంలోనే తప్పించుకున్నట్లు భావిస్తున్నారు. ఎన్కౌంటర్ ముగిసిన తరువాత పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 24 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
స్వగ్రామంలో విషాద ఛాయలు
గుణకరరావు మృతితో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని ఆయన స్వగ్రామం ఏఎస్ కవిటిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2012లో ఆయన ఆర్మీలో చేరినట్లు గ్రామస్థులు చెప్పారు. బుధవారం 8గంటల సమయంలో తమ కుమారుడు చనిపోయినట్లు ఆర్మీ అధికారులు తెలియజేశారని తల్లి జయమ్మ చెప్పారు. కాగా, గుణకరరావు తండ్రి వ్యవసాయకూలి. ఈ ఏడాది అతడికి వివాహం చేద్దామని నిర్ణయించామని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని గుణకరరావు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.