ఆర్మీ ఉద్యోగార్థుల భారీ నిరసనలు: అసలు ఏంటీ అగ్నిపథ్ స్కీమ్?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మంగళవారం త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నాలుగేళ్లు సర్వీస్ అంటూ కేంద్రం తనమను పిచ్చివాళ్లను చేస్తోందంటూ సైనిక నియామక రిక్రూట్మెంట్ ప్రిపేర్ అవుతున్న యువకులు దేశంలోని పలుచోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహించారు.
అగ్నిపథ్ పథకంపై బీహార్లోని ముజఫర్పూర్, బక్సార్, బెగూసరాయ్ లో పలువురు యువకులు నిరసన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల సర్వీసు తర్వాత తామంతా ఏం చేయాలని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. నాలుగేళ్లు మాత్రమే సర్వీసు అంటే ఆ తర్వాత ఇతర ఉద్యోగాల కోసం మళ్లీ చదువుకుని ఇతరులతో పోటీ పడాల్సి ఉంటుందన్నారు. నాలుగేళ్ల సర్వీసు కోసం తాము ఇంత కష్టపడాలా? అంటూ మండిపడుతున్నారు.
అభ్యర్థుల నిరసనలతో బక్సర్లో రైల్వే ట్రాక్లు జామ్ అయ్యాయి. ముజఫర్పూర్లో కూడా, పెద్ద సంఖ్యలో విద్యార్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. టైర్లను తగులబెట్టారు. నియామక ప్రక్రియలో పెద్ద మార్పులను ప్రతిపాదించే కొత్త పథకానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదే విషయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. సాయుధ బలగాల శౌర్య పరాక్రమాల విషయంలో కేంద్రం రాజీపడవద్దని కోరారు. కేంద్రం తాజా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. కాగా, పలువురు రాజకీయ నేతలు, సైనిక మాజీ అధికారులు కూడా కేంద్రం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలు సూచనలు కూడా చేస్తున్నారు.
అసలు ఏంటీ అగ్నిపథ్ స్కీమ్?
కాగా, కొత్త రిక్రూట్మెంట్ ప్రణాళిక ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీ జీతభత్యాలు, పింఛను బిల్లులను తగ్గించుకోవడంతోపాటు ఆయుధాల సేకరణ కోసం అధిక నిధులు వెచ్చించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద కేంద్రం పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21ఏళ్ల మధ్య వయసు కలిగిన దాదాపు 46 వేల మందిని నాలుగేళ్ల సర్వీసుపై ఈ ఏడాది నియమించుకోనుంది. వీరికి సర్వీసు కాలంలో నెలవారీగా రూ. 30వేలు-40వేల మధ్య(ఇతర అలవెన్సులు మినహాయించి) చెల్లించనున్నారు. వీటితోపాటు వైద్య, బీమా సదుపాయాలు కూడా కల్పిస్తారు.
అయితే, నాలుగేళ్ల సర్వీసు తర్వాత వీరిలో కేవలం 25 శాతం మంది అగ్నివీరులను మాత్రమే సైనిక ఉద్యోగాల్లోకి ఎంపిక చేస్తారు. వీరంతా 15ఏళ్లపాటు నాన్ ఆఫీసర్ ర్యాంకులో సేవలందించే వీలుంటుంది. మిగిలిన 75 శాతం మంది నాలుగేళ్ల తర్వాత రూ. 11 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ప్యాకేజీతో సేవల నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. అయితే, పెన్షన్ ప్రయోజనలు మాత్రం ఉండవు.