మోడీ పాలన: 65శాతం మంది ప్రజలు హ్యాపీ
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనపై 65% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్షార్ట్స్ యూత్ చేసిన అభిప్రాయ సేకరణలో ఈ విషయం వెల్లడైంది. 2016, జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఇన్షార్ట్స్ యాప్ ద్వారా ఈ పోల్ నిర్వహించారు. ఇందులో మొత్తం 1.40 లక్షల మంది 30 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
అవును, కాదు, సమాచారం లేదు అనే మూడు ఆఫ్షన్లను ఎంచుకునేలా ప్రశ్నలను రూపొందించి అడిగారు. మోడీ చేసిన విదేశీ పర్యటనలతో భారత్కు గణనీయమైన ప్రయోజనాలు లభించాయని 76% మంది పేర్కొనగా.. భారత్లో తయారీ కార్యక్రమం ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తోందని 67% అభిప్రాయపడ్డారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమం పనిచేస్తోందా? అని అడగ్గా 53% మంది అవునని, 36% మంది లేదని సమాధానం ఇచ్చారు. ధరల పెరుగుదల, విద్య, వైద్యంపై అడిగిన ప్రశ్నలకు మిశ్రమ సమాధానాలు వచ్చాయి. మోడీ ప్రభుత్వం ధరల పెరుగుదలను కట్టడి చేయగలిగిందని 46% మంది చెప్పగా, 41% మంది కట్టడి చేయడంలో విఫలమైందన్నారు.
విద్య, ఆరోగ్య రంగాలు వెనకబడ్డాయా? అనే ప్రశ్నకు 36% మంది కాదని, 22% మంది అవునని జవాబిచ్చారు. రైతుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించటానికి ప్రభుత్వం తగినన్ని చర్యలు తీసుకోవటం లేదని 62% మంది చెప్పగా, ప్రభుత్వం బాగానే పనిచేసిందని 22% మంది అభిప్రాయపడ్డారు.
ఇది ఇలా ఉండగా, మరో సర్వేలో ప్రధాని అభ్యర్థిత్వానికి నరేంద్ర మోడీయే ఉత్తముడని తేలింది. ఇండియాటూడే-కార్వ్య్ ఇన్సైట్స్ సర్వే ప్రకారం ఎన్నికలు ఇప్పుడొచ్చినా ఎన్డీఏకు 286 సీట్లు వస్తాయని వెల్లడైంది. ప్రధాని మోడీకి బలమైన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎదుగుతున్నారని సర్వే చెప్పింది.
37శాతం ఓట్లు ఎన్డీఏకు ఎటూ పోవని, 40శాతం మంది ప్రజలు దేశంలో అసహనమనేదే లేదని భావిస్తున్నారని తేల్చింది. 40శాతం మంది మోడీ అచ్చేదిన్ తీసుకొచ్చారని చెబుతుండగా, 31శాతం మంది అచ్చేదిన్ భావన కలగలేదని, మరో 22శాతం మంది అచ్చేదిన్ ఎలాంటి మార్పులు తీసుకురాలేదని చెప్పారు.